Man Set on Fire: కోడలు అక్రమ సంబంధాన్ని ప్రశ్నించాడని మామపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు
కోడలి అక్రమ సంబంధంపై నిలదీసినందుకు మామపై కిరాతకానికి పాల్పడ్డారు. దారికాచి మరీ బైక్ ఆపి పెట్రోల్ పోసి నిప్పటించి నిందితులు పరారయ్యారు. ఈ కేసులో పోలీసులు నలుగుర్ని అరెస్ట్ చేశారు.

కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కోడలు అక్రమ సంబంధం పెట్టుకుందని మందలించినందుకు, ఆ వృద్ధుడ్ని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా సజీవ దహనం చేయడానికి ప్రయత్నించాడు. తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడు రాజేంద్రన్ (64) తన కోడల్ని ప్రవర్తన మార్చుకోవాలని, ఆమెకు మణికందన్ అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధాన్ని గత కొంతకాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో కుటుంబంలో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి. తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కోపంతో రాజేంద్రన్ను అడ్డుతొలగించుకోవాలని ఆయన కోడలు తన ప్రియుడు మణికందన్ తో కలిసి ప్లాన్ చేసింది.
నడిరోడ్డుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన నిందితుడు
బాధితుడు రాజేంద్రన్ బైక్పై వెళ్తున్న సమయంలో నిందితుడు మణికందన్ తన అనుచరులతో కలిసి అతడిని అడ్డుకున్నాడు. అందరూ చూస్తుండగానే రాజేంద్రన్పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యారు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ఆర్తనాదాలు చేస్తూ రోడ్డుపై పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శరీరానికి 70 శాతం గాయాలవ్వడంతో ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూసిన వారు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నలుగురు నిందితుల అరెస్ట్
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు మణికందన్, బాధితుడి కోడలు జయప్రియతో పాటు ఇందులో పాల్గొన్న మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కడలూరు పోలీసులు వెల్లడించారు. వివాహేతర సంబంధాల వల్ల ప్రాణాల మీదకు వస్తున్న ఇటువంటి ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు వారి జీవితాలతో పాటు ఇతరుల ప్రాణాలను రిస్కులో పెడుతున్నాయి. కొన్ని సందర్భాలలో కుటుంబం మొత్తం ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. అయినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదని పోలీసులు అంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు























