Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - కారుపై కంటైనర్ పడి నలుగురు దుర్మరణం
Tirupati News: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ అదుపు తప్పి కారు, బైక్ను ఢీకొనగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Severe Accident In Tirupati: తిరుపతి జిల్లాలో (Tirupati District) గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చంద్రగిరి (Chandragiri) మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఓ కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కలకడ నుంచి చెన్నైకి టమాటా లోడుతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపు తప్పి కారు, బైక్ను ఢీకొట్టింది. కంటైనర్ కారుపై పడిపోగా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారులోని యువకుడు కంటైనర్ కింద చిక్కుకోగా.. తనను కాపాడాలంటూ వేడుకున్న దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి.





















