ED entry in IBOMMA Case: ఐ బొమ్మ రవి కేసులో ఈడీ ఎంట్రీ - భారీగా మనీలాండరింగ్ - లెక్క తేల్చేందుకు రెడీ
Ibomma Ravi: ఐబొమ్మ రవి కేసులో మనీలాండరింగ్ జరిగినట్లుగా ఈడీ అనుమానిస్తోంది. డీటైల్స్ ఇవ్వాలని హైదరాబాద్ పోలీసుల్ని కోరింది.

ED suspects money laundering in Ibomma Ravi case: తెలుగు సినిమా పరిశ్రమకు భారీ నష్టాలు కలిగించిన iBomma పైరసీ వెబ్సైట్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా దృష్టి పెట్టింది. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానించిన ఈడి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్కు లేఖ రాసి, కేసు వివరాలు, ఆర్థిక లావాదేవీల రికార్డులు అందించమని కోరింది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు iBomma మాస్టర్మైండ్ ఇమ్మడి రవి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.3.5 కోట్లకు పైగా డబ్బులు ఫ్రీజ్ చేశారు. విదేశీ బ్యాంకుల నుంచి పెద్ద మొత్తాల్లో రవి NRE ఖాతాకు బదిలీలు, నెలకు రూ.15 లక్షలు క్రిప్టో వాలెట్ల నుంచి ట్రాన్స్ఫర్లు జరగడం తేలడంతో, ఈడి ఈ అంశాలపై విస్తృత దర్యాప్తు చేపట్టనుంది.
విశాఖ వాసి ఇమ్మడి రవి iBomma వెబ్సైట్ ను ప్రారంభించి తెలుగు సినిమాలతో పాటు ఇతర ప్రాంతీయ చిత్రాలు, OTT ప్లాట్ఫారమ్ల కంటెంట్ను పైరేట్ చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. రిలీజ్ రోజే లీక్ చేసేవాడు. iBommaతో పాటు 65 మిరర్ సైట్లు, Bappam TV వంటి ఎక్స్టెన్షన్ల ద్వారా రవి వ్యవస్థను నడిపాడు. ఈ సైట్లపై అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫారమ్లకు లింక్లు ఇచ్చి, యూజర్లను డైవర్ట్ చేసి మరింత డబ్బు సంపాదించాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. రవి కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో, క్లౌడ్ఫ్లేర్ వంటి CDNలు ఉపయోగించి సర్వర్లను అమెరికా, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ల మధ్య మార్చుకుని ట్రాక్ అవ్వకుండా ఉంచాడు. భారతీయ పౌరసత్వాన్ని వదిలేసి.. సెయింట్ కిట్స్ పౌరుడైన రవి, ఫ్రాన్స్లో నివసిస్తున్నాడు. దుబాయ్, థాయ్లాండ్, USA మధ్య తిరుగుతూ ఉండేవాడు.
నవంబర్ 14న హైదరాబాద్ కు వచ్చిన రవిని కుకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. iBomma ద్వారా మొత్తం రూ.20 కోట్లకు పైగా సంపాదించాడు. పోలీసులు 35 బ్యాంక్ ఖాతాలు, మల్టిపుల్ మొబైల్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, పాస్బుక్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రవి బ్యాంక్ ఖాతాల నుంచి రూ.3.5 కోట్లకు పైగా ఫ్రీజ్ చేశారు. మొదట్లో రూ.1.6 కోట్లు, తర్వాత మరిన్ని ఖాతాలు ఐడెంటిఫై చేసి మొత్తం రూ.3 కోట్లకు పైగా బ్లాక్ చేశారు.
పైరసీ నుంచి వచ్చిన అక్రమ ఆదాయాలను మనీ లాండరింగ్ ద్వారా క్లీన్ చేస్తున్నట్టు అనుమానించిన హైదరాబాద్ పోలీసులు, ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ, ఈ కేసు వివరాలు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ట్రాన్సాక్షన్ రికార్డులు అందించమని సిపి సజ్జనార్కు లేఖ రాసింది. దీని ఆధారంగా PMLA కింద దర్యాప్తు ప్రారంభించనున్నారు. పోలీసులు కూడా మనీ లాండరింగ్ అంగిల్ నుంచి కేసును పరిశీలిస్తున్నారు. బ్యాంకులతో సంప్రదించి మరిన్ని రికార్డులు సేకరిస్తున్నారు.
దర్యాప్తులో తేలిన కీలక విషయాల్లో, విదేశీ బ్యాంక్ అకౌంట్ల నుంచి రవి NRE ఖాతాకు పెద్ద మొత్తాల్లో నిధులు బదిలీ అయినట్లుగా గుర్తించారు. ఫ్రాన్స్, దుబాయ్, స్విట్జర్లాండ్లోని బ్యాంకుల నుంచి డబ్బు ట్రాన్స్ఫర్ చేసి, పైరసీ ఆదాయాలను క్లియర్ చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రాన్సాక్షన్లు పైరసీ సంపాదనలను డిజిటల్ కరెన్సీల ద్వారా దాచిపెట్టి, తిరిగి లీగల్ చానెల్స్కు మార్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ అంశాలపై ఈడి విస్తృత దర్యాప్తు చేయనుంది. రవి పాస్పోర్ట్, ఫారిన్ అకౌంట్స్ వివరాలు స్వాధీనం చేసుకుని, ఇంటర్నేషనల్ ఏజెన్సీలతో కోఆర్డినేషన్ చేస్తున్నారు.





















