Kakinada MP Cybercrime: కాకినాడ ఎంపీకి టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు - 2 వారాల వరకూ కనిపెట్టలేకపోయారు - అంతా వాట్సాప్ డీపీ వల్లే !
Cyber criminals: సైబర్ నేరకాళ్లు కాకినాడ ఎంపీ ఉదయ్ ను 92 లక్షలకు మోసం చేశారు. వాట్సాప్ డీపీని చూసి ఎంపీ మోసపోయారు.

Cyber criminals duped Kakinada MP Uday of Rs 92 lakhs: కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ‘టీ-టైమ్’ సంస్థలో భారీ మోసం జరిగింది. ఎంపీ ఫొటోతో వాట్సాప్లో నమ్మించిన సైబర్ నేరగాళ్లు.. రూ.92 లక్షలు బదిలీ చేయమని కోరడంతో.. వారి ఫైనాన్స్ మేనేజర్ వెంటనే ఆ పని చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సైబర్ ఫ్రాడ్ ను ఎంపీ వేగంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఖాతాల్లోని నగదును వారు అప్పటికే డ్రా చేసుకున్నారు. కేవలం రూ.7 లక్షలు మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు.
జనసేన పార్టీ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు ‘టీ-టైమ్’ అనే సంస్థ ఉంది. ఉదయ్ శ్రీనివాస్ పేరును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరలేపారు. ఎంపీ ఫొటోను వాట్సాప్ ప్రొఫైల్ చిత్రంగా పెట్టి, ఆయన సంస్థకే చెందిన ఫైనాన్స్ మేనేజర్ను నమ్మించి ఏకంగా రూ.92 లక్షలు కాజేశారు. టీ-టైమ్ సంస్థలో చీఫ్ ఫైనాన్స్ మేనేజర్గా పనిచేస్తున్న గంగిశెట్టి శ్రీనివాసరావుకు గత నెల 22న ఓ అపరిచిత నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ నంబర్ ప్రొఫైల్ ఫొటోగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చిత్రం ఉండటంతో అది ఆయనేనని శ్రీనివాసరావు భావించారు. తాను కొత్త నంబర్ వాడుతున్నానని, అత్యవసరంగా కొంత డబ్బు పంపాలని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపారు.
తన యజమానే అడుగుతున్నారని పూర్తిగా విశ్వసించిన మేనేజర్, ఎటువంటి క్రాస్ చెక్ చేసుకోకుండా నేరగాళ్లు సూచించిన వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మొత్తం 11 విడతల్లో రూ.92 లక్షలు బదిలీ చేశారు.
ఈ నెల 8న ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తన కంపెనీ బ్యాంకు ఖాతాలను తనిఖీ చేస్తుండగా కొన్ని అనుమానాస్పద లావాదేవీలను గుర్తించారు. వెంటనే ఫైనాన్స్ మేనేజర్ను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తాను డబ్బుల కోసం ఎలాంటి సందేశాలు పంపలేదని, తన ఫోన్ నంబర్ కూడా మారలేదని ఎంపీ స్పష్టం చేయడంతో మేనేజర్ నివ్వెరపోయారు.
తాము మోసపోయామని గ్రహించిన వెంటనే వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, నగదు బదిలీ జరిగిన రెండు వారాల తర్వాత ఫిర్యాదు అందడంతో అప్పటికే నేరగాళ్లు ఎక్కువ మొత్తాన్ని డ్రా చేసుకున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి కేవలం రూ.7 లక్షల మొత్తాన్ని మాత్రమే ఫ్రీజ్ చేయగలిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాట్సాప్ డీపీలు పెట్టుకుని డబ్బులు బదిలీ చేయాలని అడగడం .. సైబర్ నేరాల్లో సహజమైన పద్దతి. యజమానులే అడుగుతున్నారు కదా అని చాలా మంది కంగారు పడి..డబ్బులు పంపేస్తూంటారు. తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో వాట్సాప్ చాట్స్ ను అనుసరించి ట్రాన్సాక్షన్స్ చేయాలంటే.. ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలని లేకపోతే.. మోసపోతారని పోలీసులు అంటున్నారు.





















