RBI MPC Meeting: ఆర్బీఐ వడ్డీ రేట్లు యథాతథం.. వరుసగా రెండోసారి మార్పులు చేయని రిజర్వ్ బ్యాంక్
RBI Monetary Policy Meeting: భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు.

RBI MPC Meeting: ముంబై: ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన బుధవారం జరిగిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ విధాన కమిటీ (MPC) రెపో రేటును 5.25 శాతంగా యథాతథంగా ఉంచింది. ప్రపంచ అనిశ్చితి, మారుతున్న ద్రవ్యోల్బణ పరిస్థితుల మధ్య ఈ నిర్ణయాన్ని కమిటీ ఏకగ్రీవంగా తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక వ్యవస్థపై తటస్థ వైఖరిని కొనసాగించాలని, స్థిరమైన దేశీయ వృద్ధిని బ్యాలెన్స్ చేయడంలో MPC ఈ నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 2025 నుండి RBI ఇప్పటివరకు రేట్లలో మొత్తం 125 బేసిస్ పాయింట్ల కోత విధించింది. 2019 తర్వాత మొదటిసారిగా ఆర్బీఐ ఇంత వేగంగా రేట్లను తగ్గించింది. గతంలో జరిగిన కోతలను అంచనా వేయడానికి ఫిబ్రవరి 2026లో జరిగిన గత సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ రేట్లను స్థిరంగా ఉంచింది. డిసెంబర్ 2025లో రెపో రేటులో 25 బేసిస్ పాయింట్ల కోత విధించడం తెలిసిందే.
ప్రధాన రేట్లు యథాతథం
తాజా నిర్ణయంతో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 5 శాతంగా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF), బ్యాంక్ రేటు 5.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. మారుతున్న ఆర్థిక వాతావరణానికి తగ్గట్లుగా వెసులుబాటును సూచిస్తూ MPC తటస్థ విధాన వైఖరిని పాటించింది.
ఫిబ్రవరి బ్రేక్ తర్వాత కొనసాగింపు
ఆర్థిక సంవత్సరం 2025-26 లో మొత్తం 125 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు కోతల తర్వాత, ఫిబ్రవరి 2026 పాలసీ సమీక్షలో కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. ఆ నిర్ణయాన్నే ఏప్రిల్ మీటింగ్లో ఫాలో అయింది.
రెపో రేటు అంటే ఏమిటి?
రెపో రేటు అనేది RBI వాణిజ్య బ్యాంకులకు (Commercial Banks) అప్పు ఇచ్చే వడ్డీ రేటు. బ్యాంకుల వద్ద నిధుల కొరత ఉన్న సమయంలో వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి RBI నుండి అప్పు తీసుకుంటారు. ఈ అప్పుపై వారు చెల్లించాల్సిన వడ్డీని రెపో రేటు అంటారు. మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచుతుంది. దీనివల్ల బ్యాంకులకు లోన్స్ మరింత భారమవుతాయి, వారు తమ వినియోగదారులకు ఇచ్చే లోన్ వడ్డీ రేట్లను సైతం పెంచుతారు. లోన్స్ వడ్డీ రేటు ఎక్కువైతే, ప్రజలు ఖర్చులను తగ్గించుకునేందుకు యత్నిస్తారు. ఇది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో దోహదం చేస్తుంది. మరోవైపు ఆర్థిక వ్యవస్థ మందగించినప్పుడు ప్రజలకు చౌకగా లోన్స్ అందుబాటులో ఉండేలా, మార్కెట్లో కొనుగోళ్లను ప్రోత్సహించడానికి RBI రెపో రేటును తగ్గిస్తుంది.
ట్రెండింగ్ వార్తలు






















