Microfinance loan Eligibility: హామీ లేకుండా లోన్స్.. మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరికి ఇస్తారు, RBI రూల్స్ తెలుసా ?
Microfinance Loan: సాధారణ లోన్స్ లాగే బ్యాంకులు, చిన్న ఆర్థిక బ్యాంకులు, NBFCల నుండి మైక్రోఫైనాన్స్ లోన్స్ తీసుకోవచ్చు. NGOలు, ప్రాంతీయ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు ఈ సేవలను అందిస్తున్నాయి.

Microfinance Loan Eligibility: దేశంలో పరిమిత ఆదాయం ఉన్నవారు బ్యాంకుల నుండి రుణాలు (Loans) పొందేందుకు అవసరమైన ఆస్తులు లేదా హామీలు లేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మైక్రోఫైనాన్స్ లోన్స్ ఒక ముఖ్యమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకారం, మైక్రోఫైనాన్స్ రుణాలు అనేవి ఎలాంటి గ్యారెంటీ (హామీ) లేకుండా ఇచ్చే లోన్స్.
మైక్రో ఫైనాన్స్ లోన్ అంటే.. వీటిని తీసుకోవడానికి ఎటువంటి ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. సాధారణంగా వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉన్న వ్యక్తులకు ఈ సౌకర్యం కల్పిస్తారు. తక్కువ ఆదాయం ఉన్నవారికి ఆర్థికంగా ఆసరా అందించడం అనేది ఈ లోన్స్ మంజూరు ముఖ్య ఉద్దేశ్యం. దీని ద్వారా వారు తమ అవసరాలను తీర్చుకోవడానికి లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. మైక్రో ఫైనాన్స్ లోన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
మైక్రోఫైనాన్స్ లోన్ అంటే ఏమిటి?
సాధారణ లోన్స్ తరహాలోనే మైక్రోఫైనాన్స్ రుణాలు కూడా బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, NBFCల నుండి లభిస్తాయి. ఇవే కాకుండా ఎన్జీవోలు (NGOs), ప్రాంతీయ రూరల్ బ్యాంకులు, కమర్షియల్ బ్యాంకులు,పేమెంట్ బ్యాంకులు కూడా ఈ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉండవు, సాధారణ రుణాల మాదిరిగానే ఉంటాయి. సాధారణంగా ఇందులో రూ. 10,000 నుండి రూ. 1.25 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మొత్తం అంతకంటే ఎక్కువగా కూడా ఉంటుంది.
ఈ లోన్స్లో ఎడ్యుకేషన్ లోన్, కన్స్యూమర్ ప్రొడక్ట్ లోన్, ఎమర్జెన్సీ లోన్, ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇచ్చే లోన్, అగ్రికల్చర్ లోన్, చిన్న వ్యాపారాలు లేదా వ్యక్తిగత అవసరాల కోసం ఇచ్చే లోన్ వంటివి ఉన్నాయి. దీని కాలపరిమితి సాధారణంగా 1 నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ ఎవరైనా గడువు కంటే ముందే లోన్ తిరిగి చెల్లిస్తే, వారిపై ఎటువంటి 'ప్రీపేమెంట్ పెనాల్టీ' లాంటివి విధించకపోవడం ఇందులో ఉన్న ప్రత్యేకత.
మైక్రోఫైనాన్స్ లోన్ ఎవరు తీసుకోవచ్చు?
సాధారణంగా చిన్న వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యవసాయ పనుల కోసం లేదా ఆదాయాన్ని పెంచే ఇతర పనుల కోసం మైక్రోఫైనాన్స్ రుణాలు ఇస్తారు. అయితే దీని కోసం కొన్ని ముఖ్యమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. భారత పౌరులెవరైనా దీని కోసం అప్లై చేసుకోవచ్చు, కానీ వారి వార్షిక ఆదాయం రూ. 3 లక్షల లోపే ఉండాలి.
వయస్సు విషయానికి వస్తే, 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ లోన్ పొందడానికి అర్హులు అవుతారు. అలాగే, రుణగ్రహీత చెల్లించే నెలవారీ EMI వారి నెలవారీ ఆదాయంలో 50 శాతం కంటే మించకూండా చూసుకోవాలి. ఈ నిబంధనలన్నింటినీ పూర్తి చేసే వారు ఈ మైక్రోఫైనాన్స్ లోన్ సహాయంతో తమ ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
























