By: ABP Desam | Updated at : 18 Sep 2021 12:55 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై జీఎస్టీతో బిల్లు పెరుగుతుందా?
కరోనా మహమ్మారి మొదలైన రెండేళ్ల తర్వాత తొలిసారి జీఎస్టీ మండలి ప్రత్యక్షంగా సమావేశమైంది. లఖ్నవూ వేదికగా జరిగిన ఈ సమావేశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి కనిపించింది. పెట్రోలియం ఉత్పత్తులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తీసుకురావడంపై చర్చ జరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు పన్ను చెల్లించాలని చెప్పడం మరో కారణం.
అయితే, మండలి తీసుకున్న కొన్ని నిర్ణయాలపై చాలామందికి అనేక సందేహాలు కలిగాయి. ఇకపై స్విగ్గీ, జొమాటో యాప్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేస్తే పన్ను భారం మనపైనే పడుతుందా? పెట్రోలియం ఉత్పత్తులపై మండలి సభ్యులు ఏమన్నారు? అసలు పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఏం జరుగుతుంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ససేమిరా అంటున్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు వివరిస్తోంది 'ఏబీపీ తెలుగు'.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం మొత్తంగా 45వది. గత రెండేళ్లుగా మండలి వర్చువల్గానే సమావేశమైంది. ఆ తర్వాత ఇప్పుడే ముఖాముఖి సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి కనిపించింది. ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చించిన మండలి ఏయే నిర్ణయాలు తీసుకుందో ఇప్పుడు చూద్దాం.
స్విగ్గీ, జొమాటోల్లో ఆర్డర్ చేస్తే పన్ను!
మారుతున్న జీవన శైలితో ఈ మధ్య కాలంలో ఫుడ్ అగ్రిగేటర్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బయటకు వెళ్లినప్పుడు, ఆఫీసులకు వెళ్లినప్పుడు అక్కడి నుంచే నచ్చిన ఫుడ్ను ఆర్డర్ చేయడం అలవాటైపోయింది. ఆర్డర్ చేసిన అరగంట నుంచి గంటలోపే డెలివరీ చేస్తుండటంతో స్విగ్గీ, జొమాటో వంటి వేదికలకు డిమాండ్ పెరిగింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఫుడ్ అగ్రిగేటర్లు 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దాంతో ఇకపై ఈ యాప్ల ద్వారా ఆర్డర్ చేస్తే వినియోగదారుడిపైనే అదనపు పన్ను భారం పడుతుందా అని సందేహం వ్యక్తం చేశారు.
నిజానికి అలాంటిదేమీ లేదు
రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది. రెండేళ్లలో దాదాపు రూ.2వేల కోట్లు నష్టపోయినట్టు తెలుసుకొంది. దీంతో పన్ను ఆదాయం తగ్గుతోందని భావించి ఫుడ్ అగ్రిగేటర్లే ఇకపై తమకు వచ్చే ఆర్డర్లపై పన్ను చెల్లించాలని ఆదేశించింది. అంటే రెస్టారెంట్లు సొమ్ము చేసుకుంటున్న పన్నును వారి నుంచి వసూలు చేసి స్విగ్గీ, జొమాటోయే కేంద్రానికి చెల్లించాలన్నమాట. ఈ లావాదేవీలో వినియోగదారుడిపై ఎలాంటి అదనపు భారం మోపడం లేదు. కాబట్టి ఎప్పట్లాగే మీకు ఇష్టమైన ఫుడ్ను ఆర్డర్ చేసుకొని లాగించొచ్చు.
కొవిడ్, క్యాన్సర్ ఔషధాలపై రాయితీ
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభించినప్పుడు వైద్యానికి, ఔషధాలకు అయ్యే ఖర్చు భారీగా పెరిగింది. మందుల ధర సైతం ఎక్కువగానే ఉంది. సామాన్యుడిపై పడుతున్న భారం తగ్గించేందుకు ప్రభుత్వం చాలా డ్రగ్స్పైన జీఎస్టీని తొలగించింది. కొన్నింటికి రాయితీలు ప్రకటించింది. ఆ మినహాయింపులు సెప్టెంబర్ నెలాఖరు వరకే వర్తిస్తాయని చెప్పింది. అయితే ఈ మినహాయింపులను డిసెంబర్ 31 వరకు పొడగిస్తూ జీఎస్టీ మండలి తాజాగా నిర్ణయించింది.
ఫలితంగా, యాఫోటెరిసిన్బి, తొసిజిలుమాబ్పై సున్నా, రెమ్డెసివిర్, యాంటీ కాగులెంట్స్పై ఐదు శాతం పన్నే ఉండనుంది. మరో ఏడు ఔషధాలపై పన్ను రాయితీ 12 నుంచి 5 శాతం వరకే ఉంటుంది. కేన్సర్కు ఉపయోగించే కొన్ని మందులపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించింది.
జీఎస్టీలోకి పెట్రోలియం.. నో నో!
వస్తు సేవల పన్ను పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడంపై ఆలోచించాలని కేరళ హైకోర్టు ఆదేశించడంతో జీఎస్టీ మండలి దానిపై చర్చించింది. ఆఖరికి పెట్రోల్, డీజిల్ను ఒకే పన్ను పరిధిలోకి తీసుకురావడానికి ఇది సమయం కాదని నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలు ఇందుకు ససేమిరా అన్నాయని తెలియజేశారు. పైగా కేరళ, మహారాష్ట్ర, బిహార్ పెట్రోల్పై జీఎస్టీని గట్టిగా వ్యతిరేకించాయని తెలిసింది. పెట్రోలు ధర తగ్గాలంటే కేంద్రమే సుంకం తగ్గించాలని, రాష్ట్రాల ఆదాయాన్ని ఎలా తగ్గించుకుంటామని ఆయా రాష్ట్రాల ప్రతినిధులు ప్రశ్నించారని సమాచారం. కాగా 2022 తర్వాత రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారాన్ని పంచబోమని కేంద్రం చెప్పడం గమనార్హం.
జీఎస్టీలోకి వస్తే పెట్రోల్ ఎంత తగ్గుతుంది?
మొదట పెట్రోలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.4.10 లక్షల కోట్ల రెవిన్యూ లాస్ను భరించాల్సి వస్తుందని తెలిసింది. కొవిడ్తో నష్టపోయిన ఆర్థిక వ్యవస్థకు ఇది మరింత భారమవుతుంది. ఏదేమైనా పెట్రోల్ను ఒకే పన్ను పరిధిలోకి తీసుకొస్తే మూల ధరపై గరిష్ఠ శ్లాబ్ అయిన 28శాతం పన్ను వేయడం ఖాయం.! కేంద్ర, రాష్ట్రాలు ప్రత్యేకంగా వేస్తున్న ఎక్సైజ్, వ్యాట్ను తొలగించాల్సి వస్తుంది.
ఉదాహరణకు దిల్లీని చూసుకుంటే ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం లీటర్ పెట్రోల్ మూలధర రూ.40.78. వాటిపై ఫ్రైట్ ఛార్జీలు కలుపుకుంటే డీలర్లకు రూ.41.10 ధరకు వస్తుంది. దీనిపై ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90, డీలర్ కమిషన్ రూ.3.84, డీలర్ కమిషన్పై వ్యాట్ రూ.23.35 కలుపుకుంటే వినియోగదారులకు రూ.101.19కి లీటర్ పెట్రోలు వస్తుంది.
జీఎస్టీలో ఎక్సైజ్, వ్యాట్ ఉండవు కాబట్టి మూల ధరపై 28శాతం పన్ను వేస్తారు. అంటే రూ. 11.50, డీలర్ కమిషన్ రూ.3.84 కలుపుకొంటే వినియోగదారుడు లీటర్కు రూ.56.44 చెల్లించాల్సి ఉంటుంది. ఇక డీజిల్ ధర రూ.55కు దిగొస్తుంది. మరి ఎక్సైజ్, వ్యాట్ రూపంలో వస్తున్న ఇంత ఆదాయాన్ని వదులుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొస్తాయా? చూడాలి మరి!!
Petrol-Diesel Price, 10 August: వాహనదారులకు షాక్! నేడు ఎగబాకిన ఇంధన ధరలు - మీ నగరంలో ఈరోజు ఇలా
Gold-Silver Price: బంగారం నేడు భారీ షాక్! ఊహించని రీతిలో పైకి - వెండి కూడా పైపైకి
India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!
Petrol-Diesel Price, 9 August: నేడు చాలాచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పైకి - మీ నగరంలో ఇవాళ ఇలా
Gold-Silver Price: బంగారం కొంటున్నారా? మీ నగరంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ రేట్స్ ఇలా
Karthi Confirms Kaithi 2 : 'ఖైదీ' సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన కార్తీ - విజయ్ సినిమాతో ముడి పడిన మేటర్ మరి
Warangal: ‘లాహిరి లాహిరిలో’ మూవీ సీన్ రిపీట్! ఎదురుపడ్డ ప్రత్యర్థులు - చివరికి ఎవరు నెగ్గారంటే?
BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో 323 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు; అర్హతలివే!
Proffessor Bikini Photos: ప్రొఫెసర్ బికినీ ఫోటోలు ఇన్స్టాలో, చూసేసిన స్టూడెంట్స్! 99 కోట్లు కట్టాలన్న వర్సిటీ