Budget Session 2026: 2000 మంది నక్సల్స్ లొంగుబాటు, 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
President Droupadi Murmu Speech | దేశంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకొచ్చారని, కోట్లాది గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పేర్కొన్నారు.

Budget Session 2026 | న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. దేశంలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి విముక్తి కల్పించామన్నారు. ‘భారతదేశం ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందుతోంది. దేశం స్వావలంబనతో జీవించకపోతే స్వాతంత్ర్యం అసంపూర్ణం అవుతుంది. గత 11 సంవత్సరాలుగా దేశ ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగైంది. ద్రవ్యోల్బణాన్ని తక్కువగా ఉంచడంలో మేం రికార్డును కొనసాగించాం. ఇది మధ్యతరగతి, పేదలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది’ అన్నారు.
త్వరలో ఉగ్రవాదం పూర్తిగా రూపుమాపుతాం..
ఆపరేషన్ సిందూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారత సైన్యం చూపిన ధైర్యం, పరాక్రమాన్ని మనం చూశాము. ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నాశనం చేశారు. భవిష్యత్తులో ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందన మరింత దృఢంగా, నిర్ణయాత్మకంగా ఉంటుంది. సింధు జలాల ఒప్పందం కూడా ఇందులో భాగమే" అని అన్నారు.
2000 పైగా మావోయిస్టులు లొంగిపోయారు..
నక్సలైట్లు, మావోయిస్టులపై కేంద్రం విజయాలు సాధించింది. మావోయిస్టులపై నిర్ణయాత్మక చర్య తీసుకున్నామని ముర్ము అన్నారు. నేడు, మావోయిస్టు జిల్లాల సంఖ్య 126 నుండి 8 జిల్లాలకు తగ్గింది. కేవలం 3 జిల్లాలు మాత్రమే తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2,000 మందికి పైగా మావోయిస్టులు లొంగిపోయారు. దేశం నుండి ఉగ్రవాదంతో పాటు మావోయిస్టులను సైతం పూర్తిగా నిర్మూలించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
భారత ప్రభుత్వ లక్ష్యం దేశాభివృద్ధి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇంకా మాట్లాడుతూ.. భారతదేశం సౌర విద్యుత్ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2 మిలియన్ల సౌర వ్యవస్థలను ఏర్పాటు చేశాం. లక్షలాది కుటుంబాల ఇళ్లలో విద్యుత్ ఉత్పత్తిని పెంచాం. గత 11 సంవత్సరాలలో ఈశాన్యంలో 7,200 కంటే ఎక్కువ రహదారులు నిర్మించాం. రైల్వే అభివృద్ధి కోసం ₹80,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఈ దశాబ్దం ఈశాన్యంలో భద్రతకు కీలకంగా మారింది. గిరిజన ప్రాంతాల్లోని 20,000 కంటే ఎక్కువ గ్రామాలు అభివృద్ధి దిశగా నడుస్తున్నాయి. SC విద్యార్థులకు ₹42,000 కోట్ల విలువైన స్కాలర్షిప్లు అందించాం. మా ప్రభుత్వం రైతులను రాజును చేయడం, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా భావిస్తోందని’ అన్నారు.
ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యం 20 శాతం పెరిగింది
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభించి విజయవంతంగా కొనసాగిస్తున్నాం. దీని ద్వారా ఇప్పటివరకు ₹4 లక్షల కోట్లు పంపిణీ చేశాం. దేశంలో నూనె గింజల పంటల ఉత్పత్తి కూడా పెరిగింది. దేశంలో ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యం 20 శాతం పెరిగింది. పశుసంవర్ధకం, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం జరుగుతున్నాయి. మత్స్యకారులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త విధానాన్ని అభివృద్ధి చేయడంతో 2014తో పోలిస్తే, మత్స్య సంపద 105 శాతం పెరిగిందన్నారు.
మహిళల కోసం ప్రత్యేక పథకాలు
దేశంలోని అందరు పౌరులకు సమాన హక్కులు కల్పించడం ద్వారానే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్రపతి ముర్ము అన్నారు. నా ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టింది. 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానం చేయాలని చూస్తున్నాం. 3 కోట్ల మంది మహిళలను వారి కాళ్లపై నిల్చునేలా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములు చేస్తున్నాం. 6 మిలియన్లకు పైగా మహిళలు లఖ్ పతీ దీదీలుగా మారుతున్నారు. డ్రోన్ దీదీ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోందని భారత రాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు.
























