Bank Unions Strike: నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగిన బ్యాంకు యూనియన్లు.. వారి ప్రధాన డిమాండ్లు ఇవే
HDFC, ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా సేవలు అందించే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే అవకాశం లేదు.

Bank Unions Nationwide Strike: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని బ్యాంకింగ్ సేవలు మంగళవారం రోజున నిలిచిపోనున్నాయి. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఐదు రోజుల పని వారం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త సమ్మెకు దిగింది. వారానికి 5 రోజుల పని విధానం డిమాండ్ చేస్తూ నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు.
బ్యాంక్ అధికారుల, ఉద్యోగుల 9 యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక అంబ్రెల్లా బాడీ అయిన UFBU, జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్తో జరిగిన సయోధ్య సమావేశంలో తమ డిమాండ్లపై ఎటువంటి హామీ లభించకపోవడంతో సమ్మెకు పిలుపునిచ్చింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం (జనవరి 25), సోమవారం (జనవరి 26) బ్యాంకులు ఇప్పటికే మూసివేశారు. సమ్మె కారణంగా మూడవ రోజు కూడా శాఖ స్థాయి కార్యకలాపాలు ప్రభావితం అవుతాయని, వినియోగదారులకు అసౌకర్యం కలుగుతుందని భావిస్తున్నారు.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సి.హెచ్. వెంకటాచలం మాట్లాడుతూ.. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి విస్తృతంగా చర్చలు జరిపినప్పటికీ, యూనియన్లకు అధికారుల నుండి ఎటువంటి హామీ రాలేదన్నారు. దీంతో తాము సమ్మెకు దిగక తప్పలేదని అన్నారు.
బ్యాంక్ యూనియన్ల ప్రధాన డిమాండ్లు
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) ప్రధాన కార్యదర్శి రూపం రాయ్ మాట్లాడారు. అన్ని శనివారాలను బ్యాంకు సెలవులుగా ప్రకటించే ప్రతిపాదనపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), UFBU మార్చి 2024లో ఖరారు చేసిన వేతన సవరణ ఒప్పందం సమయంలో పరస్పరం అంగీకరించాయని తెలిపారు. బ్యాంకర్లు సోమవారం నుండి శుక్రవారం వరకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి అంగీకరించారని, తద్వారా ఉత్పాదకతకు ఎలాంటి నష్టం జరగదని ఆయన తెలిపారు.
నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (NCBE) ప్రధాన కార్యదర్శి ఎల్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆందోళన మరింత స్థిరమైన బ్యాంకింగ్ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం కోసం బ్యాలెన్స్డ్ వర్కింగ్ అవసరమని పేర్కొన్నారు.
ఈ బ్యాంకుల సేవలకు నేడు అంతరాయం..
సమ్మె కారణంగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు, చెక్ క్లియరెన్స్, సాధారణ పరిపాలనాపరమైన పనులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు సాధారణంగా పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే వారి ఉద్యోగులు సమ్మె చేస్తున్న యూనియన్లలో భాగం కాదు.
UPI మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్తో సహా డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్లు పనిచేస్తూనే ఉంటాయి, అయితే కొన్ని ప్రాంతాల్లో లాజిస్టికల్ సమస్యల కారణంగా వినియోగదారులు ATMలలో నగదు కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది.
సేవల నిలిచివేతపై బ్యాంకుల ప్రకటన
SBIతో సహా పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇప్పటికే వినియోగదారులను సర్వీసు అంతరాయాల గురించి అప్రమత్తం చేశాయి. ఒక రెగ్యులేటరీ ఫైలింగ్లో, SBI సాధారణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా శాఖలు, కార్యాలయాల్లో సేవలు ప్రభావితం కావచ్చని తెలిపింది.
యూనియన్ల నిరసనకు ప్రధాన కారణం ఏమిటంటే, 5 రోజుల పని వారాన్ని నోటిఫై చేయాలని, అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించాలి. మార్చి 2024లో IBAతో 12వ ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం ఈ విషయం అంగీకరించినా, ఇంకా అమలు కావడం లేదని యూనియన్ ఆరోపిస్తోంది.
























