పెట్రోల్లో ఇథనాల్ మరింత పెరగనుందా? E25 ఫ్యూయల్ దిశగా కేంద్రం సంకేతాలు!
ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం E22, E25, E27, E30 పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయించింది. దీంతో భారత్లో E25 ఫ్యూయల్ అమలుపై ఊహాగానాలు మరింత బలపడుతున్నాయి.

E25 as default blend: భారత్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. పెట్రోల్లో 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ కలిగిన E22, E25, E27, E30 ఇంధనాలపై కేంద్ర ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా మినహాయిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇప్పటికే E20 పెట్రోల్కు ఎక్సైజ్ మినహాయింపు అమలులో ఉండగా, ఇప్పుడు అధిక ఇథనాల్ మిశ్రమాలకూ అదే ప్రయోజనం కల్పించడం ద్వారా భవిష్యత్తులో E25 ఫ్యూయల్ను దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోందనే చర్చలు మొదలయ్యాయి.
ఈ నిర్ణయానికి కొన్ని రోజుల ముందే ఇండియన్ స్టాండర్డ్ బ్యూరో (BIS) E22, E25, E27, E30 ఇంధనాల కోసం నాణ్యత ప్రమాణాలను విడుదల చేసింది. దీంతో అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల కోసం అవసరమైన నియంత్రణ, పన్ను పరమైన వ్యవస్థలు దాదాపు సిద్ధమైనట్లే కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం భారత్లో ఇథనాల్ మిశ్రమ కార్యక్రమం ప్రధానంగా E20 పెట్రోల్ చుట్టూనే సాగుతోంది. అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో E25 అంటే 25 శాతం ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని తదుపరి ప్రధాన మిశ్రమంగా ప్రకటించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఇకపై E25, E30 ఫ్యూయలే ఉంటుందా?
కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ అర్ధం E22 నుంచి E30 వరకు ఇంధనాలు వెంటనే పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి వస్తాయని కాదు. వీటిని మార్కెట్లోకి తీసుకురావడానికి ముందు వాహన తయారీ సంస్థలు, ఇంధన కంపెనీలు, నియంత్రణ సంస్థలు చాలా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంజిన్ పనితీరు, విడిభాగాల మన్నిక, ఉద్గారాల ప్రమాణాలు, వాహన భద్రత వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.
పరిశ్రమ అంచనాల ప్రకారం, ఈ ప్రక్రియకు కనీసం మూడు నుంచి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అయితే అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ముడి చమురు సరఫరాపై ప్రభావం చూపే భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగితే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.
ఇథనాల్ ఉత్పత్తిదారులు మాత్రం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ వినియోగం అంత స్థాయిలో లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. E22 అమల్లోకి వస్తే అదనంగా 120 కోట్ల లీటర్ల ఇథనాల్కు డిమాండ్ ఏర్పడుతుందని, E25 అమలైతే దాదాపు 300 కోట్ల లీటర్ల అదనపు డిమాండ్ వచ్చే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అంచనా వేస్తోంది.
మరోవైపు, ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఇటీవలే E20 అనుకూల వాహనాల తయారీకి మార్పులు పూర్తి చేసిన కంపెనీలు, భవిష్యత్తులో E25 లేదా అంతకంటే అధిక ఇథనాల్ మిశ్రమాల కోసం ఇంజిన్ కాలిబ్రేషన్, మెటీరియల్ కంపాటిబిలిటీ, సర్టిఫికేషన్ వంటి అంశాల్లో కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు.
ప్రస్తుతం వినియోగదారులు కొనుగోలు చేసే ఇంధనంలో (E20) ఎలాంటి మార్పు లేకపోయినా, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భవిష్యత్తులో E20కు మించి ఇథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగానికి బలమైన పునాది వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో భారత్ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా, రైతులకు అదనపు ఆదాయం, పర్యావరణానికి మేలు చేసే దిశగా మరో ముందడుగు వేసినట్టైంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















