Viral News: ధర్మవరం- నరసాపురం రైలు టాప్ ఎక్కి టికెట్ లేని వ్యక్తి హైడ్రామా.. ప్యాసింజర్ల గుండె గుభేల్ !
గుడివాడ స్టేషన్లో టికెట్ లేని ఓ వ్యక్తి టీసీని చూసి ధర్మవరం- నరసాపురం రైలు రూఫ్ మీదకు ఎక్కి నానా హంగామా చేశాడు. ఈ హైడ్రామా వల్ల రైలు అరగంట పాటు నిలిచిపోయింది.

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ రైల్వే స్టేషన్లో బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ హల్చల్ చేశాడు. ధర్మవరం నుండి నరసాపురం వెళ్తున్న రైలు ఉదయం 3 గంటలకు గుడివాడ స్టేషన్కు చేరుకున్న సమయంలో, రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో టికెట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో టికెట్ లేని ఒక వ్యక్తి టీసీని చూసి భయాందోళనతో రైలు పైకప్పు (రూఫ్) పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నప్పటికీ అతను రైలు టాప్ మీద తిరుగుతూ హల్చల్ చేయడంతో తమకు కూడా కరెంట్ షాక్ కొడుతుందేమోనని ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, అతి కష్టం మీద ఆ వ్యక్తిని సురక్షితంగా కిందకు దించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సదరు వ్యక్తి మతిస్థిమితం లేనివాడిగా గుర్తించారు. ఈ ఘటన కారణంగా ధర్మవరం-నరసాపురం రైలు సుమారు అరగంట పాటు గుడివాడ స్టేషన్లోనే నిలిచిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.

ఇటీవల ఇలాంటి తరహా ఘటన.. కానీ అక్కడ దారుణం
బిహార్లోని దర్భంగా జిల్లా లహేరియాసరయ్ రైల్వే స్టేషన్లో ఇటీవల అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఒక వ్యక్తి అక్కడ ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఎక్కి హల్చల్ చేశాడు. కింద ఉన్న ప్రయాణికులు ప్రమాదాన్ని పసిగట్టి, ప్రాణాలు పోతాయని గట్టిగా అరుస్తూ కిందకు దిగమని వేడుకున్నా అతను వినిపించుకోలేదు. ఈ క్రమంలో పైకి ఎత్తిన అతని వేలు ప్రమాదవశాత్తు పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది.
క్షణాల వ్యవధిలోనే భారీ విద్యుత్ షాక్కు గురైన ఆ వ్యక్తి మంటలు చెలరేగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి బోగీపై పడిపోయాడు. ఈ భయానక దృశ్యాలను కొందరు ప్రయాణికులు వీడియో తీయగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై నెటిజన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, రైల్వే స్టేషన్లలో మతిస్థిమితం లేని వారి కదలికలపై అధికారులు నిఘా పెంచాలని కోరుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు























