TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Tirumala: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులకు సిఫారసు లేఖలకు అనుమతి ఇస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 24 నుంచి అనుమతించనున్నారు.

TTD Good News: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించడం లేదని నేతలు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు టీటీడీ పరష్కారం చూపింది. ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజాప్రతినిధుల లేఖలను టీటీడీ అనుమతిస్తుంది. వారి సిఫారసుపై దర్శన టిక్కెట్లను కేటాయిస్తుంది. ఒక్కో ప్రజాప్రతినిధి రోజుకు ఒక్క లేఖ జారీ చేయడానికి అవకాశం ఇస్తారు. ఆ లేఖపై ఆరుగురు దర్శనం చేసుకోవచ్చు. ఆదివారం, సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధవారం, గురువారం ప్రత్యేక దర్శనాలకు అవకాశం కల్పిస్తారు.
ఇటీవల తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు, మంత్రి కొండా సురేఖ టీటీడీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను పట్టించుకోవడం లేదన్నారు. కొండా సురేఖ చంద్రబాబుకు లేఖ రాశారు. రఘునందన్ రావు తిరుమలలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ అంశం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు లేఖలను అనుమతిస్తూ ఉత్తర్వాలు జారీ చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం అందరు ఎమ్మెల్యేల ఎంపీల సిఫారసు లేఖలు చెల్లుబాటు అయ్యేవి. నిబంధనల ప్రకారం ఆయా లేఖలకు టిక్కెట్లు జారీ చేసేవారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత మెల్లగా సిఫారసు లేఖలు తీసుకోవడం మానేశారు. గత నాలుగేళ్లుగా తీసుకోవడం లేదని చెబుతున్నారు. టీటీడీ బోర్డును ఎప్పుడు ఏర్పాటు చేసినా తెలంగాణ వారికి ఖచ్చితంగా అందులో ప్రాధాన్యం ఇస్తున్నారు. తాజాగా టీటీడీ బోర్డులోనూ తెలంగాణకు చెందిన ముగ్గురు సభ్యులుగా ఉన్నారు. అయితే వారికి తమ అధికార పరిధి మేరకు సిఫారసు లేఖలు ఇవ్వగలరు కానీ.. ప్రజాప్రతినిధులకు మాత్రం ఆ చాన్స్ లేకుండా పోయింది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు ఓ లేఖను చంద్రబాబుకు రాశారు. రేవంత్ లేఖకు స్పందించిన చంద్రబాబు గత ఏడాది డిసెంబర్ లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు అంగీకరించారు. గత సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి, శాసనసభ్యులు ఇచ్చే విజ్ఞాపన ఉత్తరాలపై తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అవకాశం కల్పించాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వినతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. .
శ్రీవారి దర్శనానికి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే సామాన్య భక్తుల సౌకర్యం, రద్దీ, సులభంగా దర్శనం కలిగించడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలపై అనుమతులు మంజూరు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ లేఖలకు అనుమతిస్తాన్నారు. అయితే ఇప్పటి వరకూ అమలులోకి రాకపోవడంతో ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. వారి అనుచరులు సిఫారసు లేఖలు అడుగుతూండటంతో.. టీటీడీపై తెలంగాణ ప్రజాప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు సమస్యకు పరిష్కారం లభించినట్లయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

