TDP: గుడివాడను ఆ రాజధానిగా మారుస్తున్నారా? మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫైర్
మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. మంత్రి క్యాసినో నిర్వహిస్తే.. సీఎం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
![TDP: గుడివాడను ఆ రాజధానిగా మారుస్తున్నారా? మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫైర్ tdp leaders bonda uma and dhulipalla narendra Comments On kodali nani Over casino game TDP: గుడివాడను ఆ రాజధానిగా మారుస్తున్నారా? మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతల ఫైర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/22/af3c37d8222a464de4de8dc2c24ce23f_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేతలు బొండా ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర విమర్శలు చేశారు. క్యాసినో నిర్వహించిన వారిపేర్లు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఒకవేళ క్యాసినో నిర్వహించకుంటే.. నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారో.. కొడాలి నాని చెప్పాలని.. బొండా ఉమా నిలదీశారు. గుడివాడలో మంత్రి కొడాలికి చెందిన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా క్యాసినో నిర్వహించారని పేర్కొన్నారు. ఇదే విషయంపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ.. నిజాలేంటో తెలుసుకునేందుకు ఆ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లిందని బొండా చెప్పారు. అయితే అక్కడకి వెళ్లాక... పరిశీలించకుండా అడ్డుకున్నారని.. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
ఈ విషయంపై మంత్రి కొడాలి నాని స్పందించారని బొండా ఉమా తెలిపారు. క్యాసినో, పేకాట నిర్వహించారనేది నిజమైతే.. రాజకీయాల నుంచి తప్పుకొని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని వ్యాఖ్యానించినట్టు బొండా వెల్లడించారు. కొడాలి నాని దొరికిపోయి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. క్యాసినో జరిగిందని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని.. ఎప్పుడు రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. పెట్రోల్ డబ్బా తెచ్చుకుందామని బొండా వ్యాఖ్యానించారు. క్యాసినోలో డ్యాన్స్లు వేసిన వారి పేర్లు కూడా తమ వద్ద ఉన్నాయని బొండా అన్నారు.
'చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే మేమే తగులబెట్టుకుంటాం. ఒకవేళ నిరూపిస్తే మాత్రం కొడాలి నాని తగులబెట్టుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ అమలు కావట్లేదు. సీఎం చెప్పేదానికి చేసేపనికి సంబంధం ఉండట్లేదు. తాడేపల్లి నుంచి వచ్చిన సూచనలనే పోలీసులు పాటిస్తున్నారు. కొడాలి నాని నిర్వహించే క్యాసినోకు స్థానిక పోలీసులే బందోబస్తుగా ఉన్నారు. ప్రతిపక్షాలు ఇచ్చే ఫిర్యాదులను తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా లేరు. పోలీసులు క్యాసినోపై చర్యలు తీసుకోకపోతే హైకోర్టుకు వెళ్తాం' అని బొండా ఉమా అన్నారు.
ఇది దేనికి సంకేతం: ధూళిపాళ్ల
అలా బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉండటం.. దేనికి సంకేతమని టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. ఈ విషయంపై అనుమానం కలుగుతుందన్నారు. మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయలేదని ప్రశ్నించారు. జూద రాజధానిగా గుడివాడను మారుస్తున్నారా? అని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. సీఎం.. సహకారంతోనే ఈ క్యాసినో జరిగిందా? అని ప్రశ్నించారు. క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని అబద్ధాలు చెబుతున్నారని.., బయటపెట్టిన ఆధారాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: Corona Update: ఏపీలో కొత్తగా 12,926 కేసులు నమోదు, వైరస్ కారణంగా ఆరుగురు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)