CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Telangana News | దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు కాదు, ఒకే వ్యక్తి, ఒకే పార్టీ అనేది ప్రధాని నరేంద్ర మోదీ రహస్య అజెండా అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.

One Nation One Election | తిరువనంతపురం: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు కాదు.. ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ అనేది ప్రధాని నరేంద్ర మోదీ రహస్య అజెండా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గాల పునర్విభజన మరో అంశమని.. కుటుంబ నియంత్రణతో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన కారణంగా దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా అని ప్రశ్నించారు. మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం (ఫిబ్రవరి 9న) ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రసంగించారు. రాజ్యాంగం ఇచ్చిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
దక్షిణాది రాష్ట్రాలు కలిసి పనిచేయాలి
తెలంగాణ రైజింగ్ అనేది నినాదం మాత్రమే కాదని... 4 కోట్ల రాష్ట్ర ప్రజల స్వప్నమని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైజింగ్.. విజన్ -2050, దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు కలిసి పని చేయాలనే దానిపై ఆయన ప్రసంగించారు.

రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే..
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు. ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ వాటిని నెరవేర్చలేదు. తెలంగాణ జీడీపీ (Telangana GDP) సుమారు 200 బిలియన్ డాలర్లుగా ఉంది.. 2035 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే 3 జోన్లుగా విభజించాం. 160 కిలోమీటర్ల పొడవైన ఓఆర్ఆర్ (RRR) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది. చార్మినార్, హైదరాబాద్ బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్ధి...
- ఓఆర్ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెకార్ట్స్తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయనున్నాం. * ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేందుకు మేం పలు కార్యక్రమాలు చేపడుతున్నాం. దేశంలోని ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నాం.
- 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం. ఇది భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన (greenest, cleanest and best) నగరంగా ఉండనుంది. ఇది మొట్టమొదటి నెట్ జీరో సిటీ. ఫ్యూచర్ సిటీలో మేం AI సిటీని నిర్మిస్తున్నాం.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తున్నాం..
- దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నా. రూ.1,82,000 కోట్లకుపైగా పెట్టుబడులను తీసుకురాగలిగాం. గతేడాది రూ.40 వేల పెట్టుబడులు వచ్చాయి. బీఆర్ఎస్ కాలంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సాధించలేకపోయింది. హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకుగానూ మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాం.. మూసా... ఈసా నదుల కలయికే మూసీ... గత 50 ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి పూర్వ వైభవం తేవాలనుకుంటోంది. గోదావరిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నాం.. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్ను నిర్మిస్తున్నాం...
- దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ.. ఈ నేపథ్యంలో మేం డ్రై పోర్ట్ నిర్మించనున్నాం. దానిని ఆంధ్రప్రదేశ్లోని సీ పోర్ట్ (సముద్ర రేవు)కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా కలుపుతాం. హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది. అభివృద్ధి మొదట నగరాలతోనే మొదలవుతుందనేది నా భావన... మేం రీజినల్ రింగు రోడ్డును, రీజినల్ రింగు రైల్వే లైను నిర్మించబోతున్నాం. ఈ రెండింటిని రేడియల్ రోడ్ల ద్వారా కలపనున్నాం...
- మేం ఎనర్జీ పాలసీని విడుదల చేశాం. ఈవీలపై ఉన్న అన్ని పన్నులను తొలగించాం. ఈవీల అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉంది. రాష్ట్రంలోని 3 వేల ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఈవీలుగా మార్చనున్నాం. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న సెమీ అర్బన్ ఏరియాను మాన్యుఫ్యాక్చరింగ్ జోన్గా మార్చబోతున్నాం. ఇది చైనా+1 అనే మా వ్యూహానికి ప్రపంచానికి సమాధానంగా నిలవనుంది.
- ఔషధాలు, విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందువరుసలో ఉంది. వాటికి అదనంగా ఎఫ్ఎంసీజీ, రక్షణ, రాకెట్స్, స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ముందు వరుసలో నిలవాలనుకుంటున్నాం. భారతదేశానికి డాటా సెంటర్ హబ్ గా, పంప్ స్టోరేజీ హబ్గా తెలంగాణ నిలవనుంది. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులకు అనుసంధానమై, దక్షిణాది రాష్ట్రాలకు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంటర్ గా ఉండాలని మేం ఆకాంక్షిస్తున్నాం.
- ఆర్ఆర్ఆర్ వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న గ్రామాలను మార్చాలనుకుంటున్నాం. గ్రామాల్లోనూ అత్యుత్తమ వసతులు కల్పిస్తాం.. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నాం... రైతులకు ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తున్నాం.. భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నాం. పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం. దేశంలోనే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణ మాఫీ చేశాం.
- కేవలం మౌలిక వసతుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదు... రైతులు, మహిళలు, యువత, పిల్లలు, వయోధికుల అందరి విషయంలోనూ మేం దృష్టి పెడుతున్నాం.. తెలంగాణ రైజింగ్లో వారూ భాగమే. రాజీవ్ ఆరోగ్య శ్రీ లో రూ.10 లక్షల మేర హెల్త్ కవరేజీ ఇస్తున్నాం.. ఆరోగ్య సమస్యలతో తెలంగాణలో ఎవరైనా ఏ ఆసుపత్రికి వెళ్లినా మేం చూసుకుంటున్నాం.
- తెలంగాణలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాం.. అక్కా చెల్లెళ్లకు రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. ఇళ్లకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షల ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం నాలుగు లక్షల ఇళ్లు నిర్మించనున్నాం. 20 లక్షల పేద కుటుంబాలు సొంత ఇళ్ల కల నెరవేరుతుందని హామీ ఇస్తున్నా... సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం... దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయం చేస్తామని రాహుల్ గాంధీ అభయమిచ్చారు. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ. జనాభా దామాషా ప్రాతిపదికన మేం వనరులు సమకూర్చుతాం..
- వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా మా మాదిగ సోదరసోదరీమణులు పోరాడుతున్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వర్గీకరణ చేపట్టాలని మేం 2024, ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నాం.. 2025, ఫిబ్రవరి 4న ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి దాని అమలుకు తీర్మానం చేశాం. ఫిబ్రవరి 4వ తేదీని ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోనున్నాం. గ్లోబల్ ఏఐ యూసేజ్ రిపోర్ట్ ప్రకారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్లో వినియోగంలో మేం ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలోనూ మేం ప్రథమ స్థానంలో ఉన్నాం.
- మా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వకూడదా..? తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థ అయితే అది భారతదేశ వృద్ధికి ప్రయోజనం కాదా..? కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాలు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదు.






















