Chandrababu SLBC: కుటుంబానికో పారిశ్రామికవేత్త రావాలంటే బ్యాంకర్లు సహకరించాలి - ఎస్ఎల్బీసీ సమావేశంలో చంద్రబాబు విజ్ఞప్తి
SLBC meeting : బ్యాంకర్లు సహకరిస్తే పేద ప్రజల ఆర్థిక స్థితిగతులు మారుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్ నుంచి రాగానే ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్నారు.

SLBC meeting CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో కీలక అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు గాడితప్పడం వల్ల ప్రభుత్వ క్రెడిబిలిటీ దెబ్బతిన్నదని, దానిని తిరిగి పునరుద్ధరించడమే తమ తొలి ప్రాధాన్యత అని బ్యాంకర్లకు స్పష్టం చేశారు. విశ్వసనీయత ఉంటేనే తక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయని, అందుకే బ్రాండింగ్కు తాము ప్రాముఖ్యత ఇస్తున్నామని బ్యాంకర్లకు వివరించారు. రాష్ట్రానికి ఉన్న సుమారు రూ. 2 లక్షల కోట్ల రుణాలను రీ-షెడ్యూల్ చేసే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే రూ. 49 వేల కోట్లను రీ-షెడ్యూల్ చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి రూ. 1,108 కోట్ల వడ్డీ భారం తగ్గిందని వెల్లడించారు.
ఎంఎస్ఎంఈలకు పెద్దపీట
రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఎంఎస్ఎంఈ రంగం వెన్నుముక అని పేర్కొన్న ముఖ్యమంత్రి, నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఒక అద్భుతమైన వేదిక అని కొనియాడారు. అమరావతిలోని ప్రధాన కేంద్రంతో పాటు రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం , విజయవాడలలో ఏర్పాటు చేస్తున్న స్పోక్ హబ్లకు యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్ వంటి ప్రముఖ బ్యాంకులు సహకారం అందిస్తున్నాయని బ్యాంకర్ల ప్రతినిధులు ఈ సమావేశంలో వెల్లడించారు. బలహీన వర్గాలకు చెందిన చిన్న తరహా పరిశ్రమలకు బ్యాంకులు ఉదారంగా రుణాలు అందించి ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు.
వన్ ఫ్యామిలీ - వన్ ఎంటర్ ప్రెన్యూయర్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబానికో పారిశ్రామికవేత్త విధానం విజయవంతం కావాలంటే బ్యాంకర్ల తోడ్పాటు అత్యవసరమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సర్వీస్ సెక్టార్ను బలోపేతం చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పీపీపీ ప్రాజెక్టులకు కేంద్రం ఇచ్చే వీజీఎఫ్ నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని నిర్ణయించారు. దీనితో పాటు ప్రకృతి సేద్యాన్ని విస్తరించేందుకు , గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు బ్యాంకులు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు రావాలని ఆయన కోరారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు సచివాలయం 5వ బ్లాకులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల (SLBC) సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీ పయ్యావుల కేశవ్, శ్రీ కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కే విజయానంద్, వివిధ బ్యాంకులకు… pic.twitter.com/wZOkyWuDmg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 23, 2026
కలెక్టర్ల భాగస్వామ్యం - క్షేత్రస్థాయి పర్యవేక్షణ
బ్యాంకింగ్ సేవలు , ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాలనే లక్ష్యంతో, ఇకపై జరిగే ఎస్ఎల్బీసీ సమావేశాలకు జిల్లాల కలెక్టర్లను కూడా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాల వారీగా ఉన్న ఆర్థిక అవసరాలు, రుణాల పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బ్యాంకర్లు, ప్రభుత్వం ఒక టీమ్లా పనిచేయాలని, ఏపీని మళ్ళీ అగ్రగామిగా నిలబెట్టడంలో బ్యాంకుల పాత్ర అత్యంత కీలకమని చంద్రబాబు నాయుడు అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















