YSRCP MP Midhun Reddy: లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
YSRCP MP Midhun Reddy: ఆంధ్రప్రదేశ్లో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్లో ఈడీ జోరు పెంచింది. నిన్న విజయసాయిరెడ్డిని ప్రశ్నించిన అధికారులు నేడు మిథున్ రెడ్డిని విచారిస్తున్నారు.

YSRCP MP Midhun Reddy: ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడుగా ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసి విచారిస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. గురవారం వైసీపీ మాజీ లీడర్ విజయ సాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో మనీ ల్యాండరింగ్ జరిగిందనే ఆరోపణల వేళ ఈడీ స్పీడ్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని ఏపీ సిట్ అనుమానించి ఆయన్ని అరెస్టు చేసి ప్రశ్నించింది. ఇప్పుడు ఈడీ వంతు వచ్చింది. వారం రోజుల క్రితమే ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి 23న విచారణకు రావాలని ఆదేశించింది. ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు మిథున్ రెడ్డి హాజరయ్యారు. 3500 కోట్లు స్కామ్లో ఆయన పాత్రపై లోతైన ప్రశ్నలు సంధిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనపై వేచిన ఛార్జ్షీట్లో కీలకాంశాలు ప్రస్తావించింది. సిట్ దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగానే ఈడీ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆయన పాత్రపై అధికారులు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో పోగు చేసిన డబ్బులను విదేశాలకు తరలించేందుకు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు ప్రచారం జరుగుతోంది.
మిథున్ రెడ్డి విచారణకు హాజరవ్వడానికి 24 గంటల ముందే వైసీపీ మాజీ లీడర్ విజయసాయి రెడ్డిని అధికారులు ప్రశ్నించారు. నేటి విచారణలో అది కూడా కీలకం కానుందని తెలుస్తోంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు నేరుగా మిథున్ రెడ్డికి లిక్కర్ విషయాలతో సంబంధం లేకపోయినా పాలసీ మేకింగ్, టెండర్ల ఖరారు, నిధుల మళ్లింపులో ఆయనకే ప్రధాన పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని సిట్ కూడా అనుమానపడింది. వీటిపై ఈడీ ప్రశ్నించనుంది. ఈ కేసులో ఇవే ఆరోపణలతో మిథున్ రెడ్డిని రాష్ట్రం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. ఇప్పుడు ఈడీ విచారణలో ఏం తేలనుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది.























