Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Eluru News | ఏలూరు జిల్లా చింతలపూడి ఎస్సీ ప్రభుత్వ హాస్టల్లో దుప్పటి అడిగినందుకు ఓ విద్యార్థినిపై వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి ఆ చిన్నారిని బలవంతంగా ఇంటికి పంపించి వేశారు.

Chintalapudi SC Girls Hostel | చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడిలోని ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో అమానవీయ ఘటన జరిగింది. రాత్రి వేళ పడుకునే ముందు, చలిగా ఉందని.. తనకు దుప్పటి ఇవ్వాలని అడిగినందుకు.. 8వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థినిని రాత్రి 10 గంటల సమయంలో వార్డెన్ హాస్టల్ నుంచి బయటికి పంపించేశారు. బాధ్యతగా ఉండాల్సింది పోయి, విద్యార్థిని పట్ల దారుణంగా ప్రవర్తించిన వార్డెన్ తీరుపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధిత బాలిక అక్షయ మాట్లాడుతూ.. దుప్పటి అడిగినందుకు నన్ను హాస్టల్ ఖాళీ చేయమన్నారు. వార్డెన్ స్వప్న మేడం మమ్మల్ని తిడుతుంది. హాస్టల్ ఇంకా ఖాళీ చేయలని చెబితే రాత్రికి రాత్రి అమ్మతో కలిసి ఇంటికి వెళ్లిపోయానని తెలిపింది.
అసలేం జరిగిందంటే...
బాధిత బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన అక్షయ ప్రభుత్వ ఎస్సీ హాస్టల్లో ఉంటూ, స్థానిక బాలికల జడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. శనివారం రాత్రి పడుకునే ముందు తనకు దుప్పటి ఇవ్వలేదని ఆ విద్యార్థిని హాస్టల్ వార్డెన్ స్వప్నకు తెలిపింది. దీనికి వార్డెన్ తీవ్రంగా ఆగ్రహించి, వెంటనే హాస్టల్ సిబ్బందితో విద్యార్థిని తల్లిదండ్రులకు ఫోన్ చేయించారు. హాస్టల్లో మీ అమ్మాయికి సీటు లేదు, వెంటనే వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లండి అని చెప్పారు.
Warden sent me out for asking for a blanket
— Siraj Noorani (@sirajnoorani) June 29, 2026
Warden's brutality at SC girls' hostel in Chintalapudi Nagar Panchayat, #Eluru district #AndhraPradesh
Victim's parents say their daughter was sent out at 10 pm https://t.co/99vzQWiHEG pic.twitter.com/E1ZCifm905
రాత్రిపూట ఫోన్ రావడంతో ఆందోళనకు గురైన విద్యార్థిని తల్లిదండ్రులు రాత్రికి రాత్రే హాస్టల్కు చేరుకుని, అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. తమ కుమార్తెను హాస్టల్లోనే ఉండేలా చూడాలని, ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని తల్లిదండ్రులు వార్డెన్ను ఎంతగానో వేడుకున్నారు. అయినప్పటికీ వార్డెన్ ఏమాత్రం కనికరించకుండా, రాత్రి వేళ ఆ విద్యార్థినిని తల్లిదండ్రులతో పాటు ఇంటికి పంపించేశారు.
దీనిపై బాలిక తల్లితండ్రులు మాట్లాడుతూ.. మా అమ్మాయి 3 ఏళ్లుగా ఇదే వసతిగృహంలో ఉంటూ చదువుతోంది. ఫిబ్రవరిలో చెయ్యి విరగడంతో ఇంటికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించాం. కోలుకున్నాక కొన్నిరోజుల కిందట తిరిగి హాస్టల్కు తీసుకొచ్చాం. కానీ హాస్టల్ లో సీటు లేదంటూ రాత్రిపూట అని కూడా చూడకుండా ఇంటికి పంపించివేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించి, బాధ్యులైన హాస్టల్ వార్డెన్పై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
హాస్టల్ ఖాళీ చేయాలని రెండు రోజుల కిందటే చెప్పాం. ఇంకా ఎక్కడే ఎందుకు ఉన్నావు మీ నాన్నకు ఫోన్ చేయలేదా అంటూ కూతురిపై హాస్టల్ వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మేం ఫోన్లు చేస్తే హాస్టల్ లోపల ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 10 గంటల వరకు హాస్టల్ గేట్ వద్దే ఉన్నాం. వేరే పిల్లలు వచ్చి గేట్ వద్ద వదిలివెళ్లారు. నేను, నా భార్య వెళ్లి పాపను తీసుకొచ్చాం. - బాలిక తండ్రి
ఫోన్ చేశారని హాస్టల్కు వెళ్లాం. హాస్టల్ వార్డెన్ పిల్లలతో బ్యాగ్ ఇచ్చి బయటకు పంపింది. కానీ ఆమె బయటకు రాలేదు. మేం ఫోన్లు చేసినా లిఫ్ట్ చేయకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించింది. ఏం జరిగిందని అడిగితే. దుప్పటి అడిగితే హాస్టల్ ఖాళీ చేయాలని చెప్పింది. రాత్రి పది వరకు అక్కడే ఎదురుచూసినా హాస్టల్ సిబ్బంది ఎవరూ వచ్చి మాతో మాట్లాడలేదు. చేసేదేమీ లేక పాపను ఇంటికి తీసుకొచ్చాం - బాలిక తల్లి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























