Jogi Ramesh bail: జోగి రమేష్కు షాక్ - ఎక్సైజ్ కోర్టులో బెయిల్ రద్దు పిటిషన్
Jogi Ramesh : జోగి రమేష్ బెయిల్ క్యాన్సిల్ చేయాలని కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లుగా వారు పిటిషన్లో తెలిపారు.

Petition For cancel Jogi Ramesh bail: ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కుంభకోణంలో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాములకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖుల చేశారు. అక్రమంగా జరిగిన నకిలీ మద్యం తయారీ, అమ్మకాల కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ . ఆయన సోదరుడు జోగి రాములపై గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో వీరిద్దరినీ A18, A19 నిందితులుగా గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం , తాజాగా వారి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితులు బయట ఉంటే సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తారని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని సిట్ తన పిటిషన్లో గట్టిగా వాదించింది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువు , ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లను నిర్వహించినట్లు ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ రాకెట్ వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ మాస్టర్ మైండ్గా ఉన్నారని, ఆయన పర్యవేక్షణలోనే అక్రమ బాట్లింగ్ యూనిట్లు నడిచాయని కేసులోని ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు వెల్లడించారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడానికి , రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడానికి పక్కా ప్రణాళికతో ఏప్రిల్ 2024లో నకిలీ మద్యం ఉత్పత్తిని మళ్లీ ప్రారంభించాలని జోగి రమేష్ ఆదేశించినట్లు సిట్ తన అభియోగపత్రంలో పేర్కొంది.
సిట్ జరిపిన విచారణలో జోగి సోదరులకు మరియు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయి. జోగి రాము ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులు మళ్లాయని, ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేయడానికి రూ. 3 కోట్ల వరకు ఎర చూపినట్లు ఆరోపణలు ఉన్నాయి. గోవా, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలతో ఈ ముఠాకు లింకులు ఉన్నాయని, ముడిసరుకును వివిధ ప్రాంతాల నుంచి సేకరించి, నకిలీ లేబుళ్లు , హోలోగ్రామ్లతో వీటిని మార్కెట్లోకి వదిలారని దర్యాప్తులో వెల్లడైంది.
దాదాపు 83 రోజుల జైలు జీవితం తర్వాత ఇటీవల షరతులతో కూడిన బెయిల్ పొందిన జోగి సోదరులు, విడుదలైనప్పటి నుండి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజకీయ విద్వేషాలను రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం, ప్రత్యర్థి పార్టీల శ్రేణులను రెచ్చగొట్టడం ద్వారా శాంతిభద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని సిట్ తన పిటిషన్లో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఈ క్రమంలో, సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు వీరిని మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం అత్యవసరమని సిట్ కోరుతోంది. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు రానుండటంతో జోగి బ్రదర్స్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది.






















