Jogi Ramesh house attack: జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో పోలీసుల కఠిన చర్యలు - 11 మంది టీడీపీ కార్యకర్తల అరెస్ట్
TDP Arrest: జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిలో పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తం 40 మందిపై కేసులు పెట్టారు.

Jogi Ramesh house attack case: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు కేసులు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనకు సంబంధించి పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ,ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా విచారణ జరిపారు. ఈ మేరకు మొత్తం 40 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా, అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు గుర్తించిన 11 మందిని సోమవారం ఉదయం అరెస్టు చేశారు.
అరెస్టు చేసిన నిందితులకు పోలీసులు వెనువెంటనే స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించివేయడంతో వైసీపీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. నిందితులపై పెట్టిన సెక్షన్లు బెయిల్కు అనుకూలంగా ఉండటంతోనే ఇలా జరిగిందని చెబుతున్నారు. మిగిలిన నిందితుల కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ జోగి రమేష్ ఆరోపించారు మంత్రి నారా లోకేష్ ఆదేశాలతోనే తన ఇంటిపై పెట్రోల్ బాంబులు, రాళ్లతో దాడికి దిగారని అననారు. ఒకవైపు తన ఇంటిపై దాడులు చేయిస్తూనే, మరోవైపు తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నంలో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుండగా, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేయాలని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.























