Pawan Kalyan: నష్టపోయిన రైతులందరికీ సాయం - అవనిగడ్డలో పవన్ కల్యాణ్ భరోసా
Deputy CM: తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులదంరికీ పరిహారం ఇస్తామని పవన్ ప్రకటించారు. అవనిగడ్డలో దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు.

Deputy CM Pawan Kalyan: మొంథా తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. యుద్ధ ప్రాతిపదికన పంటనష్టం అంచనా... పరిహారం చెల్లిస్తామన్నారు. * తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి రైతులకు భరోసా ఇచ్చారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం రైతులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 1.38 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని, ఇందులో ఒక్క కృష్ణా జిల్లాలోనే 46వేల హెక్టార్లలో నష్టం కలిగిందనీ చెప్పారు. ఈ జిల్లాలో దాదాపు 56 వేల మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని, అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. . రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకున్నారు. అనంతరం కృష్ణా జిల్లా అధికారులు అవనిగడ్డలో తుపాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన పరిశీలించారు.
ప్రభుత్వం ముందస్తు సన్నద్దత మూలంగా మొంథా తుపానును సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం. పక్కా ప్రణాళికతో నష్టం తీవ్రతను తగ్గించాం. సీఎం ముందు చూపు కారణంగానే తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వీడియో కాన్ఫరెన్సులు, ఆర్టీజీఎస్ ద్వారా 24 గంటలు పరిస్థితులను పర్యవేక్షిస్తూ.. అటు యంత్రాంగాన్ని, ఇటు గ్రామ స్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేశాం. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా లక్ష 16 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఈ విపత్తులో కౌలు రైతులు కూడా నష్టపోయిన విషయం నా దృష్టికి వచ్చింది. వారిని ఆదుకొనే అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళతానని తెలిపారు.
తుపాను అనంతర ఉపశమన చర్యలను యుద్ధప్రాతిపదికన ప్రారంభించాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో సుమారు 274 కిలోమీటర్ల మేర రహదారులు తుపాను దాటికి దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించాం. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాం. జిల్లాల వారీగా పారిశుద్ధ్య సిబ్బందిని బృందాలుగా విభజించి పారిశుద్ధ్య మెరుగు పర్చే చర్యలు మొదలు పెట్టాం. 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితం కాగా, మొత్తం 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తున్నాం. తాగునీటి సరఫరా వ్యవస్థకు ఇబ్బంది ఏర్పటిన చోట్ల ప్రయత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మొంథా ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస శిబిరాల్లో ఉన్న వారికి 25 కేజీల బియ్యాన్ని, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం ఇవ్వాలని నిర్ణయించాం. కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్ ప్యాకెట్, కేజీ ఉల్లిపాయలు, 1 కిలో బంగాళాదుంపలు, కేజీ పంచదార కూడా కూటమి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. శిబిరాల్లో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లే ముందే ఒక్కొక్కరికీ రూ. వెయ్యి చొప్పున ఇస్తున్నాం. ఒక్కో కుటుంబానికీ గరిష్టంగా రూ. 3 వేలు చెల్లించనున్నాం. తుపాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక నివేదిక రాగానే కేంద్ర సహకారం కోరుతామన్నారు.





















