NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Andhra Pradesh NTR Vaidya Seva: నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో ఎన్టీఆర్ వైద్య సేవ రోగులకు వైద్యం నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి.

NTR Vaidya Seva to be suspended again: ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఉచితంగా వైద్యం అందించే ప్రతిష్ఠాత్మకమైన డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి గండం పొంచి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన భారీ బకాయిలు పేరుకుపోవడంతో, ఏప్రిల్ 1, 2026 రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలను నిలిపివేయాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ సమ్మెకు పిలుపునివ్వడం ఇప్పుడు రోగుల పాలిట ఇబ్బందికరంగా మారనుంది.
రూ. 3,000 కోట్ల బకాయిల సెగ
కొంతకాలంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన రీయింబర్స్మెంట్ నిధులు విడుదల కాకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 620కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నట్లు సమాచారం. ఈ నిధుల జాప్యం వల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వడం, మందుల కొనుగోలు, ఇతర నిర్వహణ ఖర్చులు భరించడం తమకు భారంగా మారిందని ఆసుపత్రుల ప్రతినిధులు వాపోతున్నారు. బకాయిల కోసం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ఆస్పత్రుల సంఘం స్పష్టం చేసింది.
సామాన్యులపై తీవ్ర ప్రభావం
ఈ సమ్మె వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పేద రోగులకు ఇబ్బందులు తప్పవు. తీవ్రమైన వ్యాధులకు సూపర్ స్పెషాలిటీ చికిత్సలు పొందుతున్న వారికి ఇది పెద్ద దెబ్బ. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్తగా ఎవరినీ చేర్చుకోబోమని, కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని ఆసుపత్రులు ప్రకటించాయి. దీంతో వేల సంఖ్యలో సర్జరీలు వాయిదా పడే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించి కనీసం కొంత మొత్తాన్ని విడుదల చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
మరోవైపు, ప్రభుత్వం ఈ బకాయిల సమస్యను పరిష్కరించేందుకు, పారదర్శకతను పెంచేందుకు డిజిటల్ పేపర్లెస్ బిల్లింగ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. అయితే, ఆసుపత్రులు మాత్రం ముందు పాత బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త సంస్కరణల గురించి మాట్లాడాలని పట్టుబడుతున్నాయి. బడ్జెట్లో వైద్య రంగానికి నిధులు కేటాయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆసుపత్రులకు నిధులు అందకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఈ గడువు ముగిసేలోగా ప్రభుత్వం చర్చలు జరిపి సమ్మెను విరమింపజేస్తుందని పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు.























