Fact Check: శ్రీశైలం ప్రసాదంలో మిడత ఓ పక్కా కుట్ర - సీసీ కెమెరా దృశ్యాలతో బట్టబయలు - కేసులు ఖాయం !
Srisailam: శ్రీశైలం ఆలయ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని జరిగిన ప్రచారం కుట్ర అని ఆధారాలతో సహా దేవస్థానం అధికారులు తేల్చారు. కుట్ర చేసిన వారిని గుర్తించి కేసులు పెడుతున్నారు.

Srisailam temple prasad: శ్రీశైల దేవస్థానం ప్రసాద విక్రయ కేంద్రంలో ఒక భక్తుడు కొన్న లడ్డూ ప్రసాదంలో మిడుత వచ్చిందని కొందరు చేస్తున్న ప్రచారం అంతా కుట్ర పూరితమని ఆలయ అధికారులు గుర్తించారు. ఓ వ్యక్తి చేసిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఆలయ అధికారులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ప్రసాదం కౌంటర్ దగ్గరున్న సీసీ ఫుటేజీ ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. సదరు భక్తుడు 6వ కౌంటర్ దగ్గర కాసేపు ఎవరి కోసమో ఎదురు చూస్తూ నిలుచున్నాడు. అంతకు ముందే 15 నిమిషాల క్రితం లడ్డూలు కొనుక్కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వచ్చి ఈ భక్తుడికి ఒక కవర్ ను ఇచ్చారు. వారు కావాలనే ఒక కీటకాన్ని తెచ్చి లడ్డూకి అంటించి వాగ్వాదానికి దిగారని ఆ సీసీ టీవీ దృశ్యాల్లో స్పష్టమయింది.
ఇదంతా జరుగుతున్నప్పుడు వారిలో ఒకరు ఈ తతంగాన్నంతా సెల్ ఫోనులో వీడియో తీసి ఒక టీవీ వాళ్లకు అందించాడు. ఆ టీవీ వారు వెంటనే ఎక్స్ ఖాతాలో దీన్ని జూన్ 29వ తేదీ మధ్యాహ్నం 3.58 గంటలకు పోస్ట్ చేశారు. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే... దర్శనానికి వచ్చే భక్తుల వద్ద మొబైల్ ఫోన్ లు ఉండవు. బయటే భద్రపరచుకుని వస్తారు కాబట్టి దర్శనం అయ్యాక ప్రసాదం కొనాలనుకుంటే కొనుక్కుని బయటకు వెళ్ళాక మాత్రమే మొబైల్ ని తీసుకునే వీలు ఉంది. కానీ వీళ్ళు కావాలనే బయటకు వెళ్లి మొబైల్ ఫోన్లు తెచ్చుకుని మళ్ళీ ప్రసాదాల కౌంటర్ దగ్గరకు వచ్చి ఈ గొడవను వీడియో తీశారు. అంటే ఇదంతా పకడ్బందీగా కావాలనే ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు.
ఈ ఆరోపణలు చేసిన వ్యక్తి కావలికి చెందిన కె. శరత్ చంద్ర గా గుర్తించారు. ఇతను నేరెళ్ల సాయి మనోజ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి దేవాలయానికి వచ్చారు. పనిగట్టుకుని శ్రీశైల క్షేత్ర ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేందుకు చేస్తున్న ఇటువంటి అసత్య ప్రచారాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. స్వామివారి ప్రసాదాల నాణ్యత విషయంలో భక్తులు ఎటువంటి అనుమానాలు పెట్టుకోనవసరంలేదని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. సున్నితమైన అంశాల్లో రెచ్చగొట్టే విధంగా కుట్రలకు పాల్పడిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కుట్రలకు పాల్పడిన వారినే కాకుండా.. వారి వెనుక ఎవరున్నారనే అంశం పైనా ఆరా తీయాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిది.
శ్రీశైలంలో స్వామి వారి ప్రసాదాల తయారీలో అన్ని దశల్లోనూ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందని ఆలయవర్గాలు చెబుతున్నాయి. ప్రసాదాల తయారీకి ఉపయోగించే సరకుల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారు. లడ్డూ విషయానికి వస్తే బూందీ తయారీ నుంచి లడ్డూ కట్టే వరకు శుచి శుభ్రత పాటించడం జరుగుతుంది. సిబ్బంది కూడా తలపై క్యాప్, చేతికి తొడుగులు ధరించి పనిచేస్తారు. పైగా ఈ లడ్డూ తయారీ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం జరుగుతుంది. మొత్తం సిబ్బంది పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి లడ్డూలో ఇటువంటివి వచ్చే అవకాశమే లేదని ఆలయవర్గాలు చెబుతున్నాయి.




















