Polavaram: నిర్వాసితుల త్యాగఫలమే పోలవరం - రూ.226 కోట్ల పరిహారం జమ చేసిన సీఎం చంద్రబాబు
Polavaram Funds deposited : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు జరిగాయి. ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Funds deposited for Polavaram displaced people: పోలవరం ప్రాజెక్టు కోసం తమ భూములను, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, భూసేకరణ , పునరావాస ప్యాకేజీ కింద మూడో విడతగా రూ.226.61 కోట్ల చెక్కును ఆయన నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత 21 నెలల కూటమి పాలనలో ఇప్పటివరకు మొత్తం 26,149 మంది నిర్వాసితులకు రూ.1,943 కోట్ల పరిహారాన్ని పారదర్శకంగా పంపిణీ చేశామని ఈ సందర్భంగా సీఎం వివరించారు.
ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. గత పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల దెబ్బతిన్న డయాఫ్రాం వాల్ను రూ.1,000 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని, మరో వారం రోజుల్లోనే ఈ పనులు పూర్తికానున్నాయని తెలిపారు. ఐదేళ్ల నిర్లక్ష్యం కారణంగా ప్రాజెక్టు 6 నుంచి 7 ఏళ్ల పాటు ఆలస్యమైందని ఆక్షేపించిన సీఎం, తమ ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లోనే నిర్మాణాన్ని పరుగులు పెట్టించామని చెప్పారు. వచ్చే ఏడాది ఉగాది తర్వాత రెండు నెలలకే, అంటే 2027 మే నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పూర్తికి మరో రూ.5,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
నిర్వాసితుల పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, తొలి దశలో 38,068 మందిని తరలించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న 75 నిర్వాసిత కాలనీల్లో 26 పూర్తి కాగా, మిగిలిన 49 కాలనీల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. 2027 ఏప్రిల్ నాటికి అందరికీ మెరుగైన పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణం కోసం ఒక్కో నిర్వాసితుడికి రూ.3.5 లక్షలు ఇవ్వడంతో పాటు, ఇంటి స్థలం కోసం ఇచ్చే మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. నిర్వాసిత ప్రాంతాల అభివృద్ధి కోసమే రంపచోడవరం నియోజకవర్గాన్ని కేంద్రంగా చేసుకుని పోలవరం జిల్లా ను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
గత ప్రభుత్వ హయాంలో వరదలు వచ్చినప్పుడు నిర్వాసితులను గాలికొదిలేశారని, కానీ తమ ప్రభుత్వం వారి పట్ల పూర్తి నిబద్ధతతో ఉందని చంద్రబాబు అన్నారు. పరిహారం చెల్లింపుల్లోనే కాకుండా, నిర్వాసిత యువతకు ఉపాధి కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేయడం తన లక్ష్యమని, నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సాగునీరు అందించి ప్రజల కల సాకారం చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా పరిహారం అందుకున్న నిర్వాసిత మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. గత ప్రభుత్వ పాలనలో తమ గోడు పట్టించుకున్న నాథుడే లేడని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తమ ఖాతాల్లోకి నిధులు సక్రమంగా చేరుతున్నాయని వారు హర్షం వ్యక్తం చేశారు.
























