Divyang Shakti Scheme: దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే దివ్యాంగశక్తి - ఉచిత బస్సు పథకం ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Free bus scheme : ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ధ్యేయమని సీఎం చంద్రబాబు అన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించారు.

Free bus scheme for disabled in AP: ఆంధ్రప్రదేశ్ లోని దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతూ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దివ్యాంగశక్తి పథకాన్ని అమరావతి వేదికగా ప్రారంభించింది. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఈ పథకాన్ని ప్రారంభించారు. బస్సులో ప్రయాణించి దివ్యాంగులతో మాట్లాడారు.
ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లోని దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ఈ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఏపీఎస్ఆర్టీసీకి చెందిన సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చు. మొత్తం 21 కేటగిరీలకు చెందిన, 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఈ సదుపాయం వర్తిస్తుంది. సహాయకులతో కలిపి మొత్తం 12.76 లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ. 207 కోట్ల భారీ వ్యయాన్ని భరించనుంది.
ఆత్మగౌరవ ప్రయాణం: చంద్రబాబు నాయుడు
పథకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావోద్వేగంగా మాట్లాడారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా, సమాజంలో తలెత్తుకుని తిరిగేలా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఉచిత ప్రయాణం మాత్రమే కాదు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆత్మగౌరవ ప్రయాణం అని కొనియాడారు. సాంకేతికతను వాడుకుని దివ్యాంగులకు మరిన్ని రాయితీలు, సేవలను నేరుగా అందించేలా భవిష్యత్తులో మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి మాట్లాడుకుంటూ ప్రయాణించారు. #DivyangaShakti#దివ్యాంగశక్తి… pic.twitter.com/cudPtvEwQX
— Telugu Desam Party (@JaiTDP) March 18, 2026
సామాజిక బాధ్యత : పవన్ కళ్యాణ్
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దివ్యాంగుల పట్ల కనికరం కంటే గౌరవం చూపడం ముఖ్యమని స్పష్టం చేశారు. దివ్యాంగశక్తి పథకం అనేది ఒక సామాజిక బాధ్యత. వారి కదలికలకు ఆర్థిక భారాలు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రతి వర్గానికి న్యాయం చేస్తుందని, దివ్యాంగుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పవన్ పునరుద్ఘాటించారు.
అవరోధాలు లేని ఆంధ్రప్రదేశ్ : నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ ఈ పథకాన్ని యువత , విద్యార్థి దివ్యాంగులకు గొప్ప వరంగా అభివర్ణించారు. చదువుకోవడానికి లేదా ఉద్యోగాల కోసం వెళ్లే దివ్యాంగులకు ప్రయాణ ఖర్చులు భారం కాకుండా ఈ పథకం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అవరోధాలు లేని ఆంధ్రప్రదేశ్గా మార్చడమే మా లక్ష్యం. ఐటీ , ఇతర రంగాల్లో కూడా దివ్యాంగులకు ప్రత్యేక శిక్షణ మరియు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం అని లోకేష్ వివరించారు.
కార్యక్రమం తర్వాత చంద్రబాబు తన క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు విందు ఇచ్చారు.
‘దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంభం అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ ఆత్మీయ విందు ఇచ్చారు.#DivyangaShakti#దివ్యాంగశక్తి#IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/XcFBlgqPyN
— Seethamsetti Venkateswararao (@svrao1953rampa) March 18, 2026
























