CM Chandrababu Naidu Speech: ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి - సీఎం చంద్రబాబు పిలుపు
Pattiseema Project: నదుల అనుసంధానం ద్వారానే దేశానికి మేలు జరుగుతుందని.. పట్టిసీమ వల్లనే వర్షాలు లేకపోయినా నీళ్లు అందుతున్నాయన్నారు. ప్రతి వర్షపు చుక్కను భూగర్భజలంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.

Polavaram Completion Date 2027: భారతదేశ నీటి పారుదల రంగ పితామహుడు, ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు స్పూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జలవనరుల పరంగా సస్యశ్యామలం చేయడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద గల కృష్ణా-గోదావరి పవిత్ర సంగమంలో బుధవారం ఘనంగా అధికారిక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేఎల్ రావు చిత్రపటానికి పూలమాల వేసి సీఎం ఘన నివాళులర్పించారు. అంతర్జాతీయ జల నిపుణుడిగా ఐక్యరాజ్యసమితి తరపున ఈజిప్ట్, సూడాన్ వంటి దేశాలకు సేవలందించి, ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పనిచేసిన విజయవాడ ముద్దుబిడ్డ కేఎల్ రావు సేవలను ఈ సందర్భంగా సీఎం కొనియాడారు.
నదుల అనుసంధానం ద్వారానే దేశానికి మేలు
నదుల అనుసంధానం ద్వారానే దేశ, రాష్ట్ర రూపురేఖలు మారతాయన్నారు. గతంలో తాము ఎంతో విజన్తో చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టును నాటి ప్రతిపక్షాలు వట్టిసీమ అని అవహేళన చేశాయని, కానీ నేడు అదే పట్టిసీమ ద్వారా తరలించిన గోదావరి జలాలు కృష్ణా డెల్టాను, రాయలసీమను కాపాడుతున్నాయని గుర్తుచేశారు. 2015 నుండి 2025 వరకు కేవలం రూ. 1,300 కోట్ల ఖర్చుతో ఏకంగా 450 టీఎంసీల నీటిని తరలించి కృష్ణా డెల్టా స్థిరీకరణ చేశామన్నారు. నీల వర్ణంలోని కృష్ణమ్మ జలాలు, అరుణ వర్ణంలోని గోదావరి జలాలు కలిసి ఈ ప్రాంతంలో బంగారం పండించాయని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో వంశధార నుండి పెన్నా వరకు రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానించడమే తన ఆకాంక్ష అని వెల్లడించారు.
2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా నిర్వీర్యం చేసిందని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాము 2014-19 మధ్య పోలవరం పనులను 72 శాతం పూర్తి చేస్తే, గత పాలకులు కనీసం 2 శాతం పనులు కూడా చేయకపోగా.. డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయేలా చేసి రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. గతంలో తాను 37 సార్లు స్వయంగా పోలవరాన్ని సందర్శించి, 136 సార్లు సమీక్షలు జరిపి పనులు వేగవంతం చేశానని, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు 89 శాతానికి చేరిందని తెలిపారు. నిర్వాసితులకు రూ. 2,250 కోట్లు చెల్లించామని, 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, ఆ తర్వాత గ్రావిటీ ద్వారానే నీరందిస్తామని సీఎం ఘోషించారు.
ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టుల పూర్తి
రాష్ట్రంలో గత ఐదేళ్ల సాగునీటి రంగ నిర్లక్ష్యాన్ని గుర్తు చేశారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా, గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు కొట్టుకుపోయినా గత పాలకులు కనీసం గ్రీజు పూయడానికి కూడా పైసలు ఇవ్వలేదని చంద్రబాబు విమర్శించారు. కానీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికన తుంగభద్ర డ్యామ్కు కొత్త గేట్లను ఏర్పాటు చేశామని, నిన్ననే ధవళేశ్వరం బ్యారేజీకి కూడా రూ. 152 కోట్లతో కొత్త గేట్ల ఆధునీకరణ పనులను ప్రారంభించామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రూ. 35 వేల కోట్ల వ్యయంతో ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం వెల్లడించారు. అలాగే గత ప్రభుత్వం నిలిపివేసిన పవిత్ర సంగమ 'పవిత్ర హారతి' కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి వర్షపు చుక్కను భూగర్భ జలంగా మార్చుకోవాలి!
రాష్ట్రంలో సాగునీటి రంగ అభివృద్ధికి తమ ప్రభుత్వం కాలపరిమితితో కూడిన పక్కా ప్రణాళికను అమలు చేస్తోందని సీఎం వివరించారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని, ఆగస్టు 14వ తేదీన గోదావరి జలాలకు అనకాపల్లి వద్ద అఖండ హారతి ఇచ్చి స్వాగతం పలుకుతామన్నారు. అలాగే 2026 ఆగస్టు 4న పేరూరు బ్రాంచ్ కెనాల్కు శంకుస్థాపన చేస్తామని, సెప్టెంబరు 1న వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు. గత పాలకులు వెలిగొండ సొరంగంలో టన్నెల్ బోరింగ్ మిషన్ ఇరుక్కుపోయినా ప్రాజెక్టు ప్రారంభించినట్లు నాటకాలు ఆడారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల ప్రజలు చైతన్యవంతులై చెడును ఖండించాలని, కురిసే ప్రతి వర్షపు చుక్కను జలధార కింద భూగర్భ జలంగా మార్చుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















