Kuppam: కుప్పం గడ్డపై గిన్నీస్ రికార్డ్- 5555 ఈ-సైకిళ్ల పంపిణీతో సరికొత్త చరిత్ర!
Guinness Book of Records: కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ఈ-సైకిళ్ల పంపిణీ కార్యక్రమం గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. ఈ సందర్భంగా చంద్రబాబు సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు.

Chandrababu Naidu e-cycle distribution program Guinness Records: పర్యావరణ పరిరక్షణ , మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విప్లవాత్మక అడుగు వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లను డ్వాక్రా మహిళలు, ఇతర లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కేవలం 24 గంటల వ్యవధిలో ఇంత భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్ సైకిళ్లను పంపిణీ చేయడం ద్వారా ఈ కార్యక్రమం గిన్నీస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. గిన్నీస్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో రికార్డుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ అందుకున్నారు.
ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. శాంతిపురం మండలం శివపురంలోని తన నివాసం నుంచి తూంసీ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభా స్థలి వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర ఆయన స్వయంగా ఈ-సైకిల్ తొక్కారు. వేలాది మంది మహిళలు తమ ఇ-సైకిళ్లతో ముఖ్యమంత్రిని అనుసరిస్తుండగా, ఆ ప్రాంతమంతా సైకిల్ నినాదాలతో హోరెత్తింది. ప్రజలు సైకిల్ గుర్తుకు ఓటేశారని, అందుకే అభివృద్ధి అంటే ఏంటో సైకిల్ వేగంతో చేసి చూపిస్తున్నామని చంద్రబాబు ఉత్సాహంగా వ్యాఖ్యానించారు.
ఈ ప్రాజెక్టులో మరో కీలకమైన అంశం మేక్ ఇన్ కుప్పం . ప్రముఖ సంస్థ ఇ-మోటరాడ్ (EMotorad) భాగస్వామ్యంతో కుప్పంలోని స్థానిక యూనిట్ లోనే ఈ సైకిళ్లను అసెంబ్లింగ్ చేస్తున్నారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా, సాంకేతికత గ్రామీణ స్థాయికి చేరువైంది. ఈ సైకిళ్లను ఇంటిపై ఉండే సోలార్ విద్యుత్ ద్వారా ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని, ఒక్క పైసా ఖర్చు లేకుండా మహిళలు తమ పనుల కోసం వీటిని వాడుకోవచ్చని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సైకిల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
పర్యావరణ పరిరక్షణ, మహిళల సాధికారతే లక్ష్యంగా పంపిణీ చేసిన 5,555 ఈ -సైకిళ్ల లబ్దిదారుల కొందరితో కలిసి కుప్పం నియోజకవర్గం, శాంతిపురం మండలం, శివపురంలోని నివాసం నుంచి తూంసీ వద్ద నిర్వహించే ప్రజావేదిక వరకూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు నేడు ర్యాలీ నిర్వహించారు.… pic.twitter.com/LBQ9Cy5FKG
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) January 31, 2026
రూ. 24 వేల విలువైన ఈ సైకిళ్లను ప్రభుత్వం భారీ సబ్సిడీతో కేవలం రూ. 5 వేలకే లబ్ధిదారులకు అందజేస్తోంది. దీనివల్ల గ్రామీణ మహిళల రవాణా కష్టాలు తీరడమే కాకుండా, వారి ఆర్థిక పురోగతికి ఇవి ఎంతగానో తోడ్పడతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుప్పం నుంచి ప్రారంభమైన ఈ గ్రీన్ మొబిలిటీ విప్లవం త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
























