Borugadda Anil: బెయిల్ గడువు ముగిసినా లొంగిపోని బోరుగడ్డ అనిల్ - పరారీలో ఉన్నట్లే - పోలీసులు ఏం చేయబోతున్నారు ?
Andhra Pradesh: వివాదాస్పద వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసినా జైల్లో లొంగిపోలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Borugadda Anil violated High Court orders: దూషణలు, చంపుతాననే బెదిరింపుల కేసుల్లో అరెస్టు అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ తీసుకుని కనిపించకుండా పోయారు. మధ్యంతర బెయిల్ గడువు ముగిసినప్పటికీ బోరుగడ్డ అనిల్ జైల్లో లొంగిపోలేదు. దీంతో ఆయన ఇప్పుడు పరారీలో ఉన్నట్లు అయింది. బెయిల్ షరతులు ఉల్లంఘించడంతో ఆయన కోసం పోలీసులు వేట సాగించే అవకాశం ఉంది. అసలు మధ్యంతర బెయిల్ నే తప్పుడు పత్రాలు సృష్టించి తీసుకున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. దీంతో బోరుగడ్డ అనిల్ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఆయన ఓ వీడియో కూడా రిలీజ్ చేశారు. తనను చంద్రబాబు, లోకేష్ చంపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు.
తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి మధ్యంతర బెయిల్
బోరుగడ్డ అనిల్ జైల్లో ఉన్న సమయంలో ఆయన తల్లికి గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో తన తల్లికి సేవలు చేసుకోవాలని తాను తప్ప.. తన తల్లికి ఎవరూ లేరని ఆయన మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆయన ఇంకా గడువు పొడిగించాలని పిటిషన్ వేశారు. అందు కోసం ఓ వైద్యుడి పత్రం జత చేశారు. ఆ పత్రం నకిలీదని తేలింది. అదే సమయంలో తల్లికి వైద్యం పేరుతో ఆయన బెయిల్ తీసుకుని తల్లి వద్దకు పోలేదని హైదరాబాద్ లో ఉన్నారని గుర్తించారు.
కోర్టుకు నివేదిక సమర్పించిన పోలీసులు
రెండో సారి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు మంగళవారం ముగిసింది. మంగళవారం రోజున ఆయన జైల్లో లొంగిపోకపోతే తీవ్ర నేరం అవుతుంది. అందుకే లొంగిపోతారని అనుకున్నారు.కానీ ఆయన ఏమనుకున్నారో కానీ.. హైకోర్టును కూడా లెక్క చేయకుండా.. పరారీలో ఉన్నారు. ఆజ్ఞాతంలో ఉన్న బోరుగడ్డ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ తీసుకుని వెళ్లిన ఆయన గడువు ముగిసినా లొంగిపోలేదని చెప్పారు. బోరుగడ్డకు పూచికత్తు ఇచ్చిన వారి వివరాలను కోర్టుకు తెలిపారు. బోరుగడ్డ అనిల్ పై పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇటీవల వీడియోలో ఏం చెప్పారంటే ?
తన తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందని ఆమెను చూసుకోవడానికే తాను మధ్యంతర బెయిల్ తీసుకున్నానని అంటున్నారు. హైకోర్టును తాను తప్పుదోవ పట్టించానని.. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చానని జరుగుతున్నప్రచారం అంతా అవాస్తవం అన్నారు. కోర్టును తాను ధిక్కరించబోనన్నారు. చంద్రబాబు, లోకేష్ తనను టార్గెట్ చేస్తున్నారని .. తనకేదైనా జరిగితే వారిదే బాధ్యతన్నారు. తనకు బెయిల్ రాకుండా.. చాలా కఠినమైన సెక్షన్లు పెట్టారని అవి తనకు వర్తించవని అన్నారు. తనకు జగనే తండ్రి అని చెప్పుకొచ్చారు. హైకోర్టు వారు కూడా పరిశీలించి తనపై వచ్చిన ఆరోపణలను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.





















