AP DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన వైఎస్సార్సీపీ - లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు రోజా, పేర్ని నాని డిమాండ్!
Nara Lokesh Resignation: డీఎస్సీ నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయంటూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు చేపట్టింది. లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

DSC Scam CBI Probe: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్షల నిర్వహణలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా తిరుపతిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో మాజీ మంత్రి ఆర్.కే. రోజా పాల్గొని విద్యాశాఖకు నేతృత్వం వహిస్తున్న మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల నుండి ఫలితాలు, మెరిట్ జాబితాల ప్రకటన వరకు ప్రతి దశలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయని, వీటన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి.
తిరుపతి ర్యాలీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి రోజా మాట్లాడారు. లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆడుకుంటోందని విమర్శించారు. పారదర్శకంగా జరగాల్సిన డీఎస్సీ ప్రక్రియలో కట్ ఆఫ్ మార్కులు, మెరిట్ జాబితాల విడుదలపై తీవ్ర గందరగోళం సృష్టించారని, అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేవలం ప్రకటనలకే పరిమితమైన మెగా డీఎస్సీ వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని, దీనిపై సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపిస్తేనే అసలు నిజాలు బయటకు వస్తాయని రోజా స్పష్టం చేశారు.
ఇదే అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం ర్యాలీ నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్పై నేరుగా సవాళ్లు విసిరారు. డీఎస్సీ మెరిట్ జాబితాను బహిరంగంగా ప్రచురించకుండా, అభ్యర్థుల ఫోన్లకు మాత్రమే మార్కుల మెసేజ్లు పంపడం వెనుక ఉన్న రహస్యమేమిటని ప్రశ్నించారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా కింద నిబంధనలకు విరుద్ధంగా టెట్, డీఎస్సీ అర్హత కూడా లేని వందలాది మందికి దొడ్డిదారిన ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపించిన ఆయన, స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 421 మంది వ్యాయామ ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు, మెరిట్ లిస్ట్ను బహిరంగంగా విడుదల చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.
కేంద్రంలో నీట్ వివాదంపై నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేస్తున్న తరుణంలో, ఏపీలో 3.5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకున్న లోకేష్ ఎందుకు రాజీనామా చేయడం లేదని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు ప్రశ్నించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజయవాడ, అనంతపురం, రాజమండ్రి, అనకాపల్లి, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన రంగాలు చేపట్టిన ర్యాలీల్లో పాల్గొన్న పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు లోకేష్ వైఖరిని ఎండగట్టారు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన నాడు-నేడు, ఇంగ్లిష్ మీడియం వంటి సంస్కరణలను రద్దు చేసి విద్యా వ్యవస్థను నాశనం చేశారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
🚨 #NaraLokeshMustResign
— YSR Congress Party (@YSRCParty) July 28, 2026
ఏపీలో డీఎస్సీ అక్రమాలపై పెల్లుబికిన ఆగ్రహజ్వాలలు
వైయస్ఆర్సీపీ యూత్, యువజన విభాగం ఆధ్వర్యంలో భారీగా ర్యాలీలో పాల్గొన్న యువత, నిరుద్యోగులు
డీఎస్సీ అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి @naralokesh రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు… pic.twitter.com/5Tf4dy0yT8
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోయినా, నారా లోకేష్ రాజీనామా చేయకపోయినా తమ పోరాటాన్ని వీధుల్లోకి తీసుకెళ్తామని వైఎస్సార్సీపీ హెచ్చరించింది. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు, ఈ నియామకాల అక్రమాలపై నిష్పాక్షికమైన సీబీఐ విచారణకు ఆదేశించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, కలెక్టరేట్ల ముట్టడులు కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















