![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
CM Jagan Review: సహకార బ్యాంకులను పటిష్టం చేస్తే రైతులకు మేలు జరుగుతోంది : సీఎం జగన్
సహకార బ్యాంకులు లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రైతులకు తక్కువ వడ్డీ రుణాలు ఇచ్చేలా చూడాలన్నారు.
![CM Jagan Review: సహకార బ్యాంకులను పటిష్టం చేస్తే రైతులకు మేలు జరుగుతోంది : సీఎం జగన్ AP CM Jagan reviews Co-operative Banks performance of Primary Agricultural Cooperative Credit Societies CM Jagan Review: సహకార బ్యాంకులను పటిష్టం చేస్తే రైతులకు మేలు జరుగుతోంది : సీఎం జగన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/24/c13b6b7787c189525758ce56757db003_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
సహకార శాఖపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్(CM Jagan) గురువారం సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమైన సీఎం..రాష్ట్రంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల పనితీరు, వాటి బ్రాంచ్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(PACS) పనితీరును సమీక్షించారు. సహకార బ్యాంకుల బలోపేతంపై ఇప్పటివరకూ తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. డీసీసీబీ(DCCB)లు, సొసైటీలు బలోపేతం, కంప్యూటరైజేషన్, పారదర్శక విధానాలు, ఆర్బీకేలతో అనుసంధానం తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు.
ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ... సహకార బ్యాంకులు మన బ్యాంకులు, వాటిని మనం కాపాడుకోవాలి. తక్కువ వడ్డీలకు రుణాలు వస్తాయి, దీనివల్ల ప్రజలకు, రైతులకు మేలు జరుగుతుంది.
తక్కువ వడ్డీ ఇవ్వడానికి ఎంత వెసులుబాటు ఉంటుందో అంత తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి. బ్యాకింగ్ రంగంలో పోటీని ఎదుర్కొనేలా డీసీసీబీలు, సొసైటీలు ఉండాలి. ఈ పోటీని తట్టుకునేందుకు ఆర్షణీయమైన వడ్డీరేట్లతో రుణాలు ఇవ్వండి. నాణ్యమైన రుణసదుపాయం ఉంటే బ్యాంకులు(Banks) బాగా వృద్ధిచెందుతాయి. మంచి ఎస్ఓపీలను పాటించేలా చూడాలి. డీసీసీబీలు లాభాల బాట పట్టేలా చూడాలని సీఎం జగన్ అన్నారు. డీసీసీబీలు పటిష్టంగా ఉంటే రైతులు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. బంగారంపై రుణాలు ఇచ్చి మిగిలిన బ్యాంకులు వ్యాపారపరంగా లబ్ధి పొందుతున్నాయని,
రుణాలపై కచ్చితమైన భద్రత ఉన్నందున వాటికి మేలు చేకూరుతోందన్నారు. ఇలాంటి అవకాశాలను సహకార బ్యాంకులు కూడా సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. వాణిజ్య బ్యాంకులు(Commercial Banks), ఇతర బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీకే బంగారంపై రుణాలు(Gold Loans) ఇవ్వడం ద్వారా ఖాతాదారులను తమవైపుకు తిప్పుకోవచ్చన్నారు.
వ్యవసాయ రంగంలో ఆర్బీకే(RBK)ల్లాంటి విప్లవాత్మక మార్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం జగన్ అన్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు ఈ రంగంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. అందుకే వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రుణాల మంజూరులో ఎక్కడా రాజీ ఉండకూడదని, రాజకీయాలకు చోటు ఉండకూడదని అన్నారు. అవినీతికి, సిఫార్సులకు తావులేకుండా కేంద్ర సహకార బ్యాంకులు కార్యకలాపాలు సాగాలన్నారు. నిబంధనలు పాటిస్తున్నారా? లేదా? అన్నది చాలా ముఖ్యమని సీఎం జగన్ అన్నారు. సహకార బ్యాంకుల్లో ఖాతాదారులకు విశ్వాసం కలిగించే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్)బ్యాంకింగ్ కార్యకలాపాలు ఆర్బీకేల ద్వారా సాగించాలని సూచించారు. ఆ మేరకు పీఏసీఎస్లను మ్యాపింగ్చేసి వాటి కింద వచ్చే ఆర్బీకేలను నిర్ణయించాలన్నారు. ఆర్బీకేల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలను పీఏసీఎస్లతో అనుసంధానం చేయాలన్నారు. ఇప్పటికే ఆర్బీకేల్లో బ్యాంకింగ్(Banking) కరస్పాండెంట్లు ఉన్నారని, వీరు రైతులకు, బ్యాంకులకు మధ్య అనుసంధాన కర్తగా వ్యవహరించాలన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నాబాబు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఎం.వి.యస్ నాగిరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై మధుసూధన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)