Chandrababu In Delhi: రాజధాని అమరావతికి చట్టబద్ధత సహా నదీ జలాల వివాదంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ
Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. అమిత్ షా, సీఆర్ పాటిల్ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అవుతున్నారు.

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్షా తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల్లో పురోగతి, కేంద్రం సహకారంపై కేంద్ర మంత్రులో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షాతో భేటీలో భాగంగా ఇదివరకే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించగా.. అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ రెండో దశ సమావేశాల్లో రాష్ట్రానికి కీలకమైన ఈ బిల్లు పెట్టాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది.

సాగునీటి ప్రాజెక్టులు, కేంద్రం సాయంపై చర్చలు..
ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయంపై విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా చర్చించారు. ఈ భేటీలో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు అధికారులు ఉన్నారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని, ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సహాయం అందించాలి... ఫేజ్–IIలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాలని చంద్రబాబు తెలిపారు. వీటికి అదనంగా దాదాపు రూ.32,000 కోట్ల నిధులు అవసరం అన్నారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం– నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు చేశారు. ఇది తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్టు అని చంద్రబాబు స్పష్టం చేశారు.
జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి, సాంకేతిక, ఆర్థిక సాయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ- ఒడిశా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని చంద్రబాబు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ను కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ (వీడబ్ల్యుడీటీ) తుది నివేదిక గెజెట్లో ప్రచురించాలని, ట్రిబ్యునల్ నివేదికను వెంటనే గెజెట్లో ప్రచురించి, వంశధారపై నిర్మించే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి అడ్డంకులు లేకుండా చేయాలని కోరారు.

గోదావరి జలాల పంపకంపై ఏపీ- తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలి. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల ఆంధ్రప్రదేశ్కు వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని కేంద్ర మంత్రికి తెలిపారు.
























