AP Speaker Ayyanna Patrudu: అసెంబ్లీకి రాని సభ్యులపై త్వరలో నిర్ణయం.. రీకాల్ విధానంపై స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Assembly Speaker Ayyanna Patrudu | అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటున్న వైసీపీ సభ్యులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Ap Assembly Session | అమరావతి: అసెంబ్లీకి రాకుండా కొందరు సభ్యులు జీతాలు తీసుకుంటున్నారని, వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. చాలా దేశాల్లో రీ కాల్ విధానం ఉందని, తాను లక్నో లో చేసిన రీ కాల్ వ్యాఖ్యలు మళ్లీ గుర్తు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉదయం ఆలస్యంగా ప్రారంభం కావడానికి గల కారణాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వివరించారు. సభ ఆలస్యానికి కారణం కోరం లేకపోవడం కాదని, కేవలం సాఫ్ట్వేర్, టెక్నికల్ సమస్యల వల్లే జాప్యం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. సభ్యులు చాలా మంది సమయానికే వచ్చారని, అయితే వైసీపీ నేతలు ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గతంలో రాజకీయాలు ముఖాముఖిగా ఉండేవని, కానీ ఇప్పుడు వెనుక ఉండి గుంతలు తవ్వే సంస్కృతి పెరిగిందని అసహనం వ్యక్తం చేశారు.
ఆ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే నిర్ణయం
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన డిజిటల్ అటెండెన్స్ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని స్పీకర్ అన్నారు. సభ్యులు సభకు రావడమే కాకుండా, లోపల ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు కూర్చున్నారో కూడా ఈ వ్యవస్థ ద్వారా ఖచ్చితంగా నమోదవుతుందని అయ్యన్న పాత్రుడు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా కేవలం జీతాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. ఉద్యోగం చేయకుండా జీతాలు తీసుకుంటే ఎవరూ ఊరుకోరని, మరి అసెంబ్లీకి రాకుండా ప్రజా ధనాన్ని జీతాల రూపంలో ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
ఈ సమస్యపై గతంలో లక్నోలో జరిగిన స్పీకర్ల సమావేశంలో కూడా తాను మాట్లాడానని అయ్యన్నపాత్రుడు గుర్తుచేశారు. విధులకు రాని ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిపించే రికాల్ (Recall) విధానం చాలా దేశాల్లో ఉందని, మన దేశంలో కూడా దీనిని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై పార్లమెంటుకు కూడా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. విశాఖపట్నం సభలో తాను ఈ విషయం చెప్పినప్పుడు 80 శాతం మంది ప్రజలు ఏకీభవించారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అసెంబ్లీలో నిర్వహించిన చిన్న పిల్లల 'మాక్ అసెంబ్లీ' గురించి స్పీకర్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేల కంటే ఆ పిల్లలే అద్భుతంగా మాట్లాడారని కొనియాడారు. ఇప్పుడు అసెంబ్లీని సందర్శించడానికి పాఠశాలల నుండి సుమారు 200 దరఖాస్తులు వచ్చాయని, రాయలసీమ నుండి విశాఖ వరకు అన్ని ప్రాంతాల విద్యార్థులు అసెంబ్లీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారని ఆయన వెల్లడించారు.
























