AP Ashirvada Deepam event 2026: ప్రధాని మోదీకి ఏపీలో ఆశీర్వాద దీపం - కేంద్ర ప్రాజెక్టుల్లో నేడు భారీ ఉత్సవం - హాజరుకానున్న కూటమి ప్రముఖులు!
Ashirvada Deepam event: ఏపీలో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన 15 ప్రధాన ప్రాజెక్టు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కూటమి ప్రముఖులు పాల్గొననున్నారు.

Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు వేడుకల్ని భిన్నంగా నిర్వహిస్తున్నారు ఏపీ నాయకులు.
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు రూ. వేల కోట్ల నిధులను మంజూరు చేసినందున.. ఆ ప్రాజెక్టుల వద్ద ఆశీర్వాద దీపం పేరిట భారీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విభజన హామీలతో పాటు ఏపీకి కీలకమైన ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం న భూతో న భవిష్యత్ అన్నట్లుగా నిధులు కేటాయించినందుకు గాను, రాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇళ్ల వద్ద, ప్రధాన ప్రాజెక్టు ప్రాంతాల్లో ఈ దీపాలను వెలిగించనున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేసిన 15 ప్రధాన ప్రాంతాలు, మౌలిక సదుపాయాల వద్ద ఈ ఆశీర్వాద దీపాల కార్యక్రమం అత్యంత ఘనంగా జరగనుంది. అమరావతి రాజధాని నిర్మాణం, కొండవీడు పర్యాటక అభివృద్ధి, విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, జాతీయ రహదారి NH-16 విస్తరణ, తిరుమల–తిరుపతి యాత్రికుల సదుపాయాలు మరియు మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం పోర్టుల అభివృద్ధి ప్రాంతాల్లో ప్రత్యేక దీపోత్సవాలు నిర్వహించనున్నారు. అలాగే విద్యా, వైద్య రరంగాల్లో వెలుగులు నింపిన మంగళగిరి ఎయిమ్స్ , ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్లతో పాటు విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల వద్ద కూడా ఈ కార్యక్రమం ప్రతిధ్వనించనుంది.
రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు కేంద్రం రూ. వేల కోట్ల నిధులు మంజూరు చేసి నిర్మాణం వేగవంతం చేయడమే కాకుండా, రాజధాని అమరావతి మౌలిక సదుపాయాల కల్పనకు వరల్డ్ బ్యాంక్, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సహకారంతో కేంద్రం అందించిన రూ. 15,000 కోట్ల భారీ ఆర్థిక సాయానికి కృతజ్ఞతగా ఈ దీపోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న బలమైన అనుబంధం వల్లనే రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పథంలోకి వచ్చిందని, ఈ నిధుల ప్రవాహం ఏపీ భవిష్యత్తును మారుస్తుందని పారిశ్రామిక, సామాజిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వినూత్న కార్యక్రమానికి కూటమి నేతుల హాజరు కానున్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు ఆయా ప్రాజెక్టుల ప్రాంగణాల్లో స్వయంగా పాల్గొని ఆశీర్వాద దీపాలను వెలిగించనున్నారు. వీరితో పాటు వివిధ రంగానికి చెందిన ప్రముఖులు, విద్యార్థులు, పర్యాటకులు, వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు. ప్రధాని మోదీ పుట్టిన రోజుకు ఈ ఆశీర్వాద దీపం' కార్యక్రమం కేవలం ఒక కృతజ్ఞతా పూర్వక వేడుక మాత్రమే కాకుండా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సాధిస్తున్న మౌలిక వృద్ధికి అద్దం పడుతోంది. విద్య, వైద్యం, లాజిస్టిక్స్, రవాణా, పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో కేంద్ర నిధులతో వచ్చిన ప్రగతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం వేదికగా ఉపయోగపడనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















