Amaravati pipes on fire: అమరావతిలో వరుసగా పైపులకు నిప్పు - కుట్ర కోణం ఉందని ప్రభుత్వం అనుమానం - విచారణ షురూ !
Amaravati pipe fires: అమరావతి పైపులకు మంటలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరమని ప్రభుత్వం అనుమానిస్తోంది. విచారణకు ఆదేశించింది.

Amaravati pipe fires were a deliberate crime: అమరావతి రాజధాని ప్రాంతంలో వరుసగా జరుగుతున్న అగ్నిప్రమాదాలు, ముఖ్యంగా హెచ్వోడీ (HOD) భవనాల సమీపంలో పైపులు తగలబడటంపై సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు.
వరుసగా పైపులకు నిప్పు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మళ్లీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. రాయపూడి సమీపంలోని హెచ్వోడీ భవనాల నిర్మాణ ప్రాంగణంలో సోమవారం రాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రాజధాని నిర్మాణ పనుల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ అక్కడ నిల్వ ఉంచిన భారీ పైపులకు ఒక్కసారిగా నిప్పంటుకోవడంతో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే, అగ్నిప్రమాదాలు జరగడానికి ఏమాత్రం అవకాశం లేని చోట ఇలా వరుసగా జరుగుతుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వరుసగా మూడు ఘటనలు.. పెరిగిన అనుమానాలు
రాజధాని ప్రాంతంలో గత పదిహేను రోజుల్లోనే ఇది మూడో ప్రమాదం. ఈ నెల 11వ తేదీన వెలగపూడి జంక్షన్ వద్ద ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన పైపులు తగలబడ్డాయి. అంతకుముందు కూడా ప్రధాని పర్యటన సమయంలో వెంకటపాలెం సమీపంలో ఇలాంటి ప్రమాదాలే జరిగాయి. సాధారణంగా ఈ పైపులు HDPE, PVC తయారీవి. త్వరగా అంటుకునే స్వభావం కలవి కావు, కానీ ఎండిపోయిన గడ్డిని పైపుల వరకు వరుసగా పేర్చి నిప్పు పెట్టినట్లు కొన్ని చోట్ల ఆనవాళ్లు లభించడంతో ఇది ప్రమాదం కాదు కుట్ర అనే అనుమానాలు బలపడుతున్నాయి.
సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం - ప్రత్యేక విచారణ
అమరావతిలో జరుగుతున్న ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని పనులు ఊపందుకుంటున్న తరుణంలో ఇలాంటి ఘటనలు జరగడం యాదృచ్ఛికం కాదని అభిప్రాయపడ్డారు. దీని వెనుక ఏదైనా విద్రోహ చర్య . కుట్ర కోణం ఉందేమో తేల్చాలని డీజీపీ, సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. నిర్మాణ సామగ్రిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ దాడులపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని స్పష్టం చేశారు.
భద్రత పెంపు.. ఫోరెన్సిక్ దర్యాప్తు
ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలంలో నమూనాలను సేకరించాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారా లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వంటి కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. రాజధాని ప్రాంతంలో నిర్మాణ సామగ్రి నిల్వ ఉంచిన చోట్ల సీసీ కెమెరాల నిఘాను పెంచాలని, సెక్యూరిటీని కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారా అన్న కోణంలో నిఘా వర్గాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అమరావతిలో వరుసగా జరుగుతున్న ఈ అగ్నిప్రమాదాలు ఇప్పుడు రాజకీయంగాను, పరిపాలనా పరంగాను పెద్ద చర్చకు దారితీశాయి. ప్రభుత్వం చేపట్టే విచారణలో ఎలాంటి విషయాలు బయటపడతాయో వేచి చూడాలి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు
















