Bill Gates Amaravati Tour: బిల్ గేట్స్ కోసం ముస్తాబైన అమరావతి.. మైక్రోసాఫ్ట్ అధినేత షెడ్యూల్ ఇదే
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ సోమవారం ఏపీలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు.

Bill Gates is coming to Amaravati: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ అమరావతి పర్యటన నేపథ్యంలో రాజధాని నగరం సరికొత్త అందాలను సంతరించుకుంది. బిల్ గేట్స్ సహా VIP లు పర్యటించే మార్గాల్లో సుందరీకరణ పనులు చేపట్టిన అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ రాజధాని కి న్యూ లుక్ ఇచ్చింది.
బిల్ గేట్స్ పర్యటనకు చంద్రబాబు హై ప్రయారీటీ
బిల్ గేట్స్ అమరావతి పర్యటనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఏడీసీ ఛైర్పర్సన్ ,మేనేజింగ్ డైరెక్టర్ డి. లక్ష్మీ పార్థసారథి ఆదేశాల మేరకు ప్రముఖులు పర్యటించే మార్గాల్లో ప్రత్యేక సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేశారు.ప్రధానంగా కృష్ణా కరకట్ట,,సీడ్ యాక్సిస్ రోడ్డు,రాష్ట్ర సచివాలయానికి వెళ్లే N-9 రోడ్డు మార్గాల్లో 10 కిలోమీటర్ల మేర రహదారులను పూర్తిగా రెడీ చేశారు. డివైడర్లకు ఆకర్షణీయమైన రంగులు వేస్తూ అమరావతి కి కొత్త అందాన్ని తీసుకొచ్చారు.సీయం ఇల్లు ఉండే కృష్ణా కరకట్టపై ఇరువైపులా లెవెలింగ్ పనులు చేపట్టారు. వీఐపీ మార్గాలను వాటర్ ట్యాంకర్లతో శుభ్రపరిచి దుమ్ము, ధూళీ లేకుండా నీట్ గా మార్చారు. రహదారులపై చెత్త తొలగింపు, పచ్చదనం పెంపు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన సాగాయి.

శివరాత్రి రోజూ పనుచేసిన అధికారులు
కరకట్ట, సీడ్ యాక్సిస్ రోడ్డు, N-9 మార్గాల్లో ఫ్యాన్ పామ్స్, గోగన్ విలియా, క్లోజియా రోజియా, అరేక పామ్స్ వంటి ఆకర్షణీయ పూల మొక్కలను నాటారు.అతిథులను ఆకట్టుకునేలా పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆదివారం శివరాత్రి పర్వదినం అయినప్పటికీ ఏడీసీ ఇంజనీరింగ్, గార్డెనరీ విభాగ అధికారులు, సిబ్బంది చురుగ్గా ఏర్పాట్లలో మునిగితేలారు.. అన్ని పనులు సమయానికి పూర్తి చేసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు.
బిల్ గేట్స్ టూర్ తో అమరావతికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్
బిల్ గేట్స్ పర్యటనతో అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చే అవకాశముందని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని నగర సుందరీకరణ ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను మరింత పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.ఇవన్నీ కలగలసి అమరావతి కి పెట్టుబడులు మరింత గా తెచ్చిపెడతాయనేది చంద్రబాబు ఆలోచన.

అమరావతిలో బిల్ గేట్స్ షెడ్యూల్ ఇదే
సోమవారం బిల్ గేట్స్ తో పాటు గేట్స్ ఫౌండేషన్ కు చెందిన 6గురు ప్రతినిధుల బృందం అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి రానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ లతో కలిసి బిల్ గేట్స్ బృందం కొద్దిసేపు సమావేశం అయిన తరువాత సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శిస్తారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, దాని ద్వారా సాధిస్తున్న ఫలితాలను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా బిల్ గేట్స్ కు వివరిస్తారు. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని కూడా గేట్స్ పరిశీలించనున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి మీటింగ్ హాలులో బిల్ గేట్స్ సహా గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు సమావేశమై రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంఫై చర్చిస్తారు. దీనిలో స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ముఖ్యమంత్రి చంద్రబాబు క్లుప్తంగా ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సాంకేతిక సాగు సహా తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్నారు. ప్రత్యేకించి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది.
అనంతరం అమరావతిలోని ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బిల్ గేట్స్ బృందం సందర్శిస్తుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపడుతున్న సాగు విధానాన్ని బిల్ గేట్స్ స్వయంగా పరిశీలిస్తారు..























