Breaking News Live: ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ హఠాన్మరణం
Breaking News Live: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్డేట్స్, వివరాలు మీకోసం

Background
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ శుక్రవారం పోలవరంలో పర్యటనకు వెళ్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను, పునరావాస కాలనీలను సీఎం జగన్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ పరిశీలించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరు 1 పునరావాస కాలనీకి చేరుకోనున్నారు. అక్కడ నిర్వాసితులతో సీఎం, కేంద్ర మంత్రి మాట్లాడతారు.
పోలవరం నిర్వాసితుల వద్దకు సీఎం
ఆ తర్వాత 11.20 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడువాయి పునరావాస కాలనీకి చేరుకుని అక్కడ నిర్వాసితులతో మాట్లాడతారు. అక్కడి నుంచి 12.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ చేరుకుని పోలవరం ప్రాజెక్ట్ (Polavaram Project) నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు పోలవరం డ్యామ్ సైట్ నుంచి తిరిగి బయలుదేరి 5.30 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
ఝార్ఖండ్ పర్యటనకు సీఎం కేసీఆర్
గతంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖరరావు ఝార్ఖండ్ పర్యటనకు వెళ్లారు. చైనా సరిహద్దులోనీ గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను ఆదుకునేందుకు ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఢిల్లీ నుంచి రాంచీ వెళ్లి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తో కలిసి, వారి అధికారిక నివాసం లో రూ.10 లక్షల చెక్కులను జార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు అందజేయనున్నారు.
చైనా తో జరిగిన ఘర్షణలో తెలంగాణ రాష్ట్రానికే చెందిన కల్నల్ సంతోష్ బాబు వీర మరణం చెందగా వారి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. అదే సందర్భంగా అమరులైన 19 మంది అమర జవాన్ల కుటుంబాలను కూడా ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం కేసిఆర్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం.. ఢిల్లీ నుంచి శుక్రవారం సీఎం కేసిఆర్ ఝార్ఖండ్ కు బయలు దేరి ఝార్ఖండ్ కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలను ఆర్థిక సాయం అందించనున్నారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత ప్రకటించిన ప్రకారం, మిగిలిన అమర జవాన్ల కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం కేసిఆర్ చర్యలు చేపట్టనున్నారు.
ఉక్రెయిన్తో చర్చలు మొదలుపెట్టినా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్లో ఉన్న యూరప్ లోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై రష్యా బలగాలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. రష్యా దాడులతో జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంటులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని స్థానిక అధికారులు మీడియాకు తెలిపుతూ ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ కన్నుమూత
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ కన్నుమూశారు. థాయ్ లాండ్ లో గుండె పోటుతో ఆయన మరణించారు.
బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్ కు గుండెపోటు
చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడు పేట జాతీయ రహదారిపై చంద్రగిరి మండలం అగరాల గ్రామం వద్ద తృటిలో ప్రమాదం తప్పింది. వాహనం నడుపుతుండగా ఆర్టీసీ బస్ డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ బస్సు వేగం తగ్గించి దారి పక్కన నిలిపివేశాడు. కాసేపటికే డ్రైవర్ గుండె పోటుతో మృతి చెందారు. తిరుపతి నుంచి పాకాల మీదుగా ఆర్టీసీ అద్దె బస్సు పుంగనూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతుడు శ్రీకాళహస్తికి చెందిన బి.రవిగా పోలీసులు గుర్తించారు. తాను మరణించినా బస్సు ప్రమాదం బారిన పడకుండా తప్పించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు బస్సు డ్రైవర్.





















