Weather Updates: తెలంగాణకు భారీ వర్ష సూచన, ఏపీలోనూ.. వాతావరణశాఖ హెచ్చరిక.. ఎప్పటి నుంచంటే..
ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. దాని ప్రభావంతో ఆగస్టు 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.

తెలంగాణలో కొన్ని రోజులుగా శాంతించిన వరుణుడు మళ్లీ ప్రతాపం చూపించనున్నట్లు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలే కురుస్తాయని చెప్పారు. కానీ, ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని.. దాని ప్రభావంతో ఆగస్టు 16 నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
హైదరాబాద్లోనూ తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయని వాతావరణశాఖ అధికారి వివరించారు.
ఆగస్టు 11 రాత్రివేళ హైదరాబాద్ వాతావరణ విభాగం ట్వీట్ చేసిన వివరాల ప్రకారం.. మర్నాడు అంటే ఆగస్టు 12న రాత్రి వరకూ తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు ప్రదేశాలలో కురిసే అవకాశం ఉందని సూచించారు. చాలాచోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు. కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వివరించారు.
తెలంగాణలో ఈ జిల్లాల్లోనే వానలు పడే అవకాశం
హైదరాబాద్లోని వాతావరణ విభాగం అధికారిక వెబ్సైట్లోని వివరాల ప్రకారం.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఇలా..
కోస్తా, రాయలసీమల్లో గత నెల ఆఖరి వారం నుంచి వానలు అస్సలు పడడం లేదు. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా చాలా చోట్ల వర్షాభావం ఉంటోంది. ఉత్తరకోస్తాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మూడు వారాలుగా సరైన వర్షాలు కురవడం లేదు. దీనికితోడు పడమర, వాయువ్య దిశ నుంచి పొడిగాలులు వీయడం, బంగాళాఖాతంలో అల్పపీడనాల జాడ లేకపోవడంతో కోస్తాలో వాతావరణం వేసవి తరహాలో ఉంటోంది. మరో 4 రోజుల వరకు రుతుపవనాలు బలహీనంగా ఉండి.. ఆ తర్వాత బలపడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
రెండ్రోజుల్లో వానలకు అవకాశం..
బిహార్ ప్రాంతంలోని ఉపరితల ఆవర్తనం.. ఉత్తర-దక్షిణ ద్రోణి జార్ఖండ్, ఒడిశా మీదుగా ఉత్తరకోస్తాంధ్ర వరకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఈనెల 13న ఏర్పడబోయే అల్పపీడనం వల్ల కూడా 15 నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















