Sammakka Saralamma: సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులు రాతి కట్టడాలతోనే- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Mulugu: సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడి నుంచే పాదయాత్ర మొదలుపెట్టాని గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ వనదేవతలను దర్శించుకున్న సీఎం వంద రోజుల్లో అభివృద్ధి పనులు చేస్తామని మాట ఇచ్చారు.

Sammakka Saralamma: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లాలో పర్యటించారు. పర్యటన సందర్భంగా అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ఆలయ అభివృద్ధి పనులకు సంబంధించి డిజిటల్ ప్లాన్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, కొండ సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ , ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది కేవలం ఒక బాధ్యత కాదు.. ఇది బాధ్యతతో కూడిన భావోద్వేగం అన్నారు.
"నాడు పాలకులు సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారు. సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో ఆనాడు ఇక్కడి నుంచే నేను పాదయాత్ర మొదలుపెట్టా. ఫిబ్రవరి 6, 2023న ఈ గడ్డపై నుంచి తెలంగాణకు పట్టిన చీడ, పీడను వదిలించేందుకు అడుగులు వేశాం."
"ఆదివాసీలు ఈ దేశానికి మూలవాసులు ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశాం.
ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా ఆదివాసీ, గిరిజనుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేస్తున్నాం." అని చెప్పుకొచ్చారు.
"సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణంతో సీతక్కకు, నాకు ఈ జన్మ ధన్యమైనట్లే ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది."
"ఆదివాసీలను, పూజారులను, సంప్రదాయ కుటుంబాలను ఆలయ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నాం."
"రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిపోతాయి అందుకే సమ్మక్క సారలమ్మ అభివృద్ధిలో రాతి కట్టడాలే నిర్మిస్తాం. మహా జాతర నాటికి భక్తులకు అసౌకర్యం కలగకుండా పనులు పూర్తి చేస్తాం."
"పగలు, రాత్రి నిర్విరామంగా పనులు చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. స్థానికుల భాగస్వామ్యం, సహకారం ఉంటేనే ఇది జరుగుతుంది."
"సమ్మక్క సారక్క మాలధారణ చేసినట్లుగా భక్తితో పనులను నిర్వహించాలని అధికారులను ఆదేశించా. మహాజాతరకు మళ్లీ వస్తా… ఈసారి జాతరను గొప్పగా చేసుకుందాం.కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం… ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు ఎందుకు నిధులు ఇవ్వడంలేదు."
"జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మేడారం మహాజాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం" అని అన్నారు.





















