KTR Challenges Revanth Reddy: చేతకాకపోతే వారం రోజులు కేసీఆర్కి అప్పజెప్పండి.. అన్ని జలాశయాలు నింపి చూపిస్తాం: రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్!
తెలంగాణ ప్రభుత్వానికి చేతకాకపోతే వారం రోజులపాటు కేసీఆర్కు బాధ్యతలు అప్పగించాలని, అన్ని జలాశయాలను నీటితో నింపి చూపిస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు.

జనగామ: కాళేశ్వరం ప్రాజెక్టు నీటి నిర్వహణపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే లక్షల క్యూసెక్కుల గోదావరి నీటిని సముద్రంలోకి వృధాగా వదిలేస్తోందని ఆయన మండిపడ్డారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద కేవలం ఒక్క పంప్ ఆన్ చేసినా నీళ్లన్నీ బ్రహ్మాండంగా పైకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టులను నడపడం చేతకాకపోతే.. కేవలం వారం రోజుల పాటు ప్రాజెక్టుల బాధ్యతను కేసీఆర్కు అప్పగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రంగంలోకి దిగితే పంపులన్నీ ఆన్ చేసి, అన్ని జలాశయాలను నీటితో నింపి, రాష్ట్రంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందించి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. కన్నెపల్లి వద్ద వృధాగా పోతున్న జలాలను పరిశీలించడానికి వెళ్తున్న తమను పోలీసులు జనగామ వద్దే అక్రమంగా అడ్డుకున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీస్తే.. ఉన్నతాధికారుల నుండి, పైనుండి ఆదేశాలు ఉన్నాయంటూ పోలీసులు సమాధానం ఇస్తున్నారని కేటీఆర్ చెప్పారు.
ప్రభుత్వం తన వైఫల్యాలు మరియు దొంగతనం బయటపడుతుందనే భయంతోనే పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్న కేటీఆర్ కు స్టేషన్ ఘనపూర్ వద్ద ఘన స్వాగతం లభించింది. పూలు చల్లుతూ, టపాసులు పేలుస్తూ స్వాగతం పలికిన బీఆర్ఎస్ శ్రేణులు.. సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు.
LIVE: కాళేశ్వరం పర్యటనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS https://t.co/PFoIldOgBT
— BRS Party (@BRSparty) July 5, 2026

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లిలోని లక్ష్మీ పంప్ హౌస్ పర్యటనకు బయలుదేరిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు జనగామ జిల్లా పెంబర్తి, కొమల్ల చెక్పోస్ట్, టోల్గేట్ వద్ద బారికేడ్లు, లారీలు అడ్డుపెట్టి వరుసగా నిలిపివేశారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర వాగ్వాదానికి దిగి కాన్వాయ్ను ముందుకు పంపారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వరంగల్, జనగామ జిల్లాల్లో పలువురు నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గోదావరిలో 93.5 మీటర్ల మేర నీరున్నందున మేడిగడ్డతో సంబంధం లేకుండా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి జలాశయాలు నింపవచ్చని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వృథాగా వదిలేస్తూ రైతులను ఎండబెడుతోందని మండిపడ్డారు. నీళ్లిస్తే యూరియా, బోనస్, మద్దతు ధర ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే రేవంత్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టి తమను నిరోధిస్తున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లి చేరుకుని వృథా జలాలను రైతులకు చూపిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ట్రెండింగ్ వార్తలు























