Telangana Rajya Sabha Elections: రెండు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్కే చాన్స్ - కానీ ఆశావహులు ఇరవై మంది!
Rajya Sabha seats: తెలంగాణలో ఎన్నికలు జరగనున్న రెండు రాజ్యసభ స్థానాల కోసం ఇరవై మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. హైకమాండ్ నుంచి ఓ నేత దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Contesting for two Rajya Sabha seats: తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ప్రస్తుత సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ , కె.ఆర్. సురేష్ రెడ్డి ల పదవీకాలం ఏప్రిల్ 9తో ముగియనుంది. వీరిలో సింఘ్వీ కాంగ్రెస్ నుంచి.. సురేష్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి ఎంపికయ్యారు. మార్చి 16న జరగనున్న ఈ ఎన్నికల్లో శాసనసభలో ఉన్న బలాబలాల ప్రకారం ఈ రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పార్టీల బలాబలాల విశ్లేషణను పరిశీలిస్తే, 119 స్థానాలున్న తెలంగాణ అసెంబ్లీలో ఒక రాజ్యసభ సీటు గెలవడానికి సుమారు 40 మొదటి ప్రాధాన్యతా ఓట్లు అవసరం. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా 65 మంది ఎమ్మెల్యేలు ఉండటమే కాకుండా, ఇతర పార్టీల నుండి చేరిన ఎమ్మెల్యేల మద్దతుతో రెండు స్థానాలను సులువుగా గెలుచుకునే అవకాశం ఉంది. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ తన వద్ద ఉన్న సంఖ్యాబలం సరిపోకపోవడంతో ఈసారి తన స్థానాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ, మజ్లిస్ ఎవరికీ మద్దతుగా ఓట్లేసే అవకాశం లేదు. మజ్లిస్ ఒక వేళ ఓటింగ్ లో పాల్గొంటే కాంగ్రెస్కు సహకరిస్తుంది. అందుకే రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అందుకే కాంగ్రెస్లో అభ్యర్తులు ఎక్కువగా పోటీ పడుతున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి రెన్యువల్ దాదాపు ఖాయమని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ గళాన్ని వినిపించడంలో, పార్టీకి సంబంధించిన న్యాయపరమైన అంశాలను డీల్ చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఉప ఎన్నిక ద్వారా ఆయన తెలంగాణ నుంచి ఎంపికయ్యారు, ఇప్పుడు పూర్తి కాలానికి గాను ఆయనను హైకమాండ్ మళ్ళీ బరిలోకి దింపే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం.
ఇక రెండో స్థానం కోసం తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నేత టి. జీవన్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్, మాజీ విసి సుదర్శన్ రెడ్డి, పార్టీలో సీనియర్ అయిన వి. హనుమంతరావు, ఇటీవల బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కె. కేశవరావు వంటి హేమాహేమీలు ఈ రేసులో ఉన్నారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఈ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 26న నోటిఫికేషన్తో ప్రారంభమై మార్చి 16న పోలింగ్, అదే రోజు కౌంటింగ్తో ముగియనుంది. సింఘ్వీ అభ్యర్థిత్వం దాదాపు ఖరారు కావడంతో, మిగిలిన ఒక్క సీటు కోసం పైరవీలు ఢిల్లీ స్థాయికి చేరుకున్నాయి. పార్టీ విధేయులకే ప్రాధాన్యత ఉంటుందని అధిష్టానం సంకేతాలు ఇస్తున్న సమయంలో , ఈ రెండో బెర్త్ ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు





















