TSRTC Protest: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ధర్నా - 11 గంటలకు రాజ్ భవన్ ముట్టడి
TSRTC Protest: గవర్నర్ తమిళిసై ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ.. ఆమె తీరుకు నిరసనగా ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు.

TSRTC Protest: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్నారని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఆమె తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. దాదాపు రెండు గంటల పాటు చేపట్టిన ధర్నా విజయవంతంగా ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి డిపోల ఎదుట ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు నిరసనలకు దిగారు. నల్ల బ్యాడ్జీలు ధరించి మరీ ధర్నాలో పాల్గొన్నారు. దీంతో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. గవర్నర్ కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కార్మికుల ఆందోళనతో ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
మరోవైపు ఈరోజు ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ ముట్టడికి తెలంగాణ మజ్దూర్ యూనియర్ పిలుపునిచ్చింది. ఉదయం 9 గంటల వరకే ఆర్టీసీ కార్మికులందరూ హైదరాబాద్ ట్యాంక్ బండ్ లోని నెక్లెస్ రోడ్డుకు చేరుకోవాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరుతామని చెప్పారు. ఎలాంటి సాగదీతలు లేకుండా వెంటనే ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు.
బిల్లుపై కొనసాగుతున్న సస్పెన్స్
అసెంబ్లీలో ఆర్టీసీ విలీనం బిల్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మనీ బిల్ కావడంతో.. గవర్నర్ ఆమోదానికి పంపించింది సర్కార్. బిల్ కు గవర్నర్ ఆమోదం తెలపలేదు. గవర్నర్ ఆమోదం కోసం తెలంగాణ అసెంబ్లీ ఎదురు చూస్తోంది. న్యాయసలహా తీసుకొని సమస్యలు రాకుండా చూసుకునేందుకు ఆర్టీసీ విలీనం బిల్లు అనుమతికి సమయం కావాలన్నారు గవర్నర్ తమిళిసై. కావాలనే గవర్నర్ ఈ బిల్లుపై స్పందించలేదన్న విమర్శలపై ఆమె స్పందించారు. తనకు బిల్లు మొన్న మధ్యాహ్నం అందిందని.. కొంత సమయం అవసరమని ామె స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలను రేపటితో ముగించాలని సర్కార్ చూస్తోంది.
ఆర్టీసీ విలీన బిల్ ను ఇవాళ వస్తే.. ఆదివారం రోజు కూడా సభ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక వేళ గవర్నర్ రేపటి వరకు ఆమోదించకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తిగా మారింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఇటీవల రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆసంస్థలో పనిచేస్తున్న 43 373 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు.టీఎస్ఆర్టీసీ బిల్లు వ్యవహారం గవర్నర్, గవర్నమెంట్ మధ్య మరోసారి వివాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ఆమోదించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న టైంలో కొన్నింటికి గవర్నర్ నుంచి ఆమోదం లభించకపోవడంతో వివాదానికి కారణవుతోంది. టెక్నికల్గా ఇది ఆర్థిక బిల్లు అయినందున ముందు గవర్నర్ పర్మిషన్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే ఇప్పుడు ఈ బిల్లు అనుమతి కోసం గవర్నర్ తమిళిసై వద్దకు పంపించి ప్రభుత్వం. ఈ సమావేశాల్లో కచ్చితంగా ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. శాసన సభ వర్షాకాల సమావేశాలను మూడు రోజుల్లో ముగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికే రెండు రోజులు సమావేశాలు పూర్తయ్యాయి. ఇంకొక రోజు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఇంత వరకు గవర్నర్ నుంచి ఆర్టీసీ విలీనం బిల్లుపై ఎలాంటి కదలిక లేదు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నారు. చాలా మంది పేదలకు న్యాయం చేద్దామని చూస్తుంటే రాజ్భవన్ నుంచి సానుకూల స్పందన రాలేదంటున్నారు. మొదటి నుంచి గవర్నర్ ఇదే తీరున వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు.
Before You Go
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
ట్రెండింగ్ వార్తలు






















