Top Maoist leaders Surrender: మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు - ఇక ఉనికి కోల్పోయినట్లేనా?
Maoist Surrender: నలుగురు మావోయిస్టు అగ్రనేతలు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మిగిలిన వారు కూడా లొంగిపోవాలని డీజీపీ పిలుపు

Maoist leaders Surrender: మావోయిస్టు ఉద్యమంలో టాప్ పొజిషన్లో ఉన్న నలుగురు అగ్రనేతలు మంగళవారం రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీలో అత్యున్నత నిర్ణయాత్మక విభాగాలైన పొలిట్బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న కీలక నేతలు అజ్ఞాతాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారు. లొంగిపోయిన వారిలో పొలిట్బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ , కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ , తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ , రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనే నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న ఉన్నారు. దశాబ్దాల కాలంగా అడవుల్లో ఉంటూ సాయుధ పోరాటాన్ని నడిపిన వీరు, పోలీసుల ముట్టడి , అనారోగ్య కారణాలతో తుపాకీని వీడారు.
ఉద్యమం ముగింపు దిశగా..
విలేకరుల సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని స్పష్టం చేశారు. వరాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్టు వ్యవస్థ నిర్వీర్యమైంది. సిద్ధాంతాల పట్ల అయోమయం, అంతర్గత విభేదాలు, క్షేత్రస్థాయి వాస్తవాల దృష్ట్యా వీరు హింసను వీడి బయటకు వచ్చారు అని ఆయన పేర్కొన్నారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస పథకం కింద సుమారు 90 లక్షల రూపాయల రివార్డు మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.
తెలంగాణలో మిగిలి ఉన్న బలం ఎంత?
రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి గురించి డీజీపీ కీలక సమాచారం అందించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన కేవలం 11 మంది క్యాడర్ మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో మాజీ అగ్రనేత గణపతి కూడా ఉన్నారని తెలిపారు. అయితే ఈ 11 మందిలోనూ కేవలం ఒకరు లేదా ఇద్దరు మాత్రమే చురుగ్గా ఉన్నారని, మిగిలిన వారంతా ఉద్యమానికి దూరంగా లేదా ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారని పేర్కొన్నారు. దీంతో తెలంగాణలో మావోయిస్టుల ప్రాబల్యం దాదాపు శూన్యమైందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
అజ్ఞాతంలో దశాబ్దాల ప్రస్థానం
లొంగిపోయిన నేతలు దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా అజ్ఞాతంలో గడిపారు. తిప్పిరి తిరుపతి 44 ఏళ్లుగా, మల్లా రాజిరెడ్డి 46 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా సాయుధ పోరాటంలో కొనసాగుతున్నారు. చొక్కారావు 28 ఏళ్లు, నర్సింహారెడ్డి 36 ఏళ్లుగా అడవుల్లోనే జీవించారు. ఆయుధాల తయారీలో దిట్టగా పేరున్న దేవ్ జీ, పార్టీ సైనిక విభాగానికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు. వీరు బయటకు రావడం మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భద్రతా దళాలు విశ్లేషిస్తున్నాయి.
మావోయిస్ట్ ఉద్యమం ఇక ముగింపు దశకు చేరుకుంది. నేను మరొకసారి పిలుపునిస్తున్నాను… వనాన్ని వీడి జనంలోకి రండి. మీ కుటుంబాలతో కలిసి మీ గ్రామాల్లో హాయిగా జీవించండి.
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) February 24, 2026
పోరు వద్దు ఊరు ముద్దు!! pic.twitter.com/A7mT0YWjbR
మెరుగైన పునరావాసం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు, హింసను వీడి వచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. లొంగిపోయిన నేతలకు తక్షణ ఆర్థిక సాయంతో పాటు, ఆరోగ్య సంరక్షణ , గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. అడవుల్లో ఇంకా మిగిలి ఉన్న వారు కూడా కాలం చెల్లిన సిద్ధాంతాలను పక్కన పెట్టి, సమాజ వికాసంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.























