Telangana RTC strike: అర్థరాత్రి నుంచే తెలంగాణ ఆర్టీసీ బంద్ - కార్మిక సంఘాలతో ప్రభుత్వ కమిటీ చర్చలు ఫలిస్తాయా?
RTC bandh: అర్థరాత్రి నుంచే తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మెలోకి వెళ్తున్నారు. హడావుడిగా ప్రభుత్వం కార్మిక సంఘాలతో చర్చలకు కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఫలితాలు కనిపించడం లేదు.

Telangana RTC bandh from midnight : తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం నెలకొంది. ప్రభుత్వం, ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో, కార్మిక సంఘాలు సమ్మెకే మొగ్గు చూపాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే బుధవారం తెల్లవారుజామున మొదటి షిఫ్ట్ నుండే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. మొత్తం 32 డిమాండ్ల సాధన కోసం జేఏసీ ఇచ్చిన పిలుపుతో సుమారు 50 వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉండబోతున్నారు.
ప్రధాన డిమాండ్లు - ప్రభుత్వ విలీనంపై పట్టు
ఈ సమ్మెలో కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం. సంస్థను ప్రభుత్వ శాఖగా గుర్తించి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వారు పట్టుబడుతున్నారు. దీనితో పాటు 2021 నుండి పెండింగ్లో ఉన్న వేతన సవరణ ను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల అద్దె పద్ధతిని నిరసిస్తూ, సంస్థే నేరుగా బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ డిమాండ్ చేస్తోంది.
ప్రభుత్వ కమిటీపై అసంతృప్తి
సమ్మెను నివారించేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు ఫలించలేదు. ప్రభుత్వం సమ్మె పరిష్కారానికి జీవో నంబర్ 66 ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, జేఏసీ నేతలు దానిని తిరస్కరించారు. కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప, తమ సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడం లేదని వారు మండిపడుతున్నారు. నాడు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు వెనక్కి తగ్గేదే లేదు అని జేఏసీ చైర్మన్ ప్రకటించడంతో సమ్మె అనివార్యమైంది.
60 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం
ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 బస్సులు రోడ్డెక్కే అవకాశం లేదు. హైదరాబాద్లోని సిటీ బస్సులతో పాటు, జిల్లాలకు వెళ్లే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు కూడా నిలిచిపోనున్నాయి. ప్రతిరోజూ బస్సుల్లో ప్రయాణించే సుమారు 60 లక్షల మంది సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు ఈ సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ముఖ్యంగా ఎయిర్పోర్ట్ పుష్పక్ సర్వీసులు కూడా నిలిచిపోతుండటంతో విమాన ప్రయాణికులకు కూడా కష్టాలు తప్పవు.
ప్రభుత్వ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
సమ్మె దృష్ట్యా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రైవేట్ వాహనాలను, పాఠశాల బస్సులను తాత్కాలికంగా ప్రయాణికుల కోసం వాడుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అవసరమైతే తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని పరిమిత సంఖ్యలో బస్సులను నడిపేందుకు సిద్ధమవుతోంది. అయితే, కార్మిక సంఘాలు మాత్రం డిపోల వద్ద నిరసనలకు సిద్ధమవుతుండటంతో బుధవారం ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు




















