Telangana Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరం - రెండు స్థానాలు ఏకగ్రీవమే !
Two Rajya Sabha seats: తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక నామినేషన్ పై ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో తిరస్కరించనున్నారు.

Two Rajya Sabha seats in Telangana to be unanimous: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి గురువారం తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉన్న సింఘ్వీని మరోసారి ఎంపిక చేయడంతో పాటు, పార్టీ విధేయుడైన నరేందర్ రెడ్డికి అవకాశం ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి తన పట్టును నిరూపించుకున్నారు.
కాంగ్రెస్కు మద్దతు ప్రకటించిన మజ్లిస్
ఈ ఎన్నికల్లో మజ్లి పార్టీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. అసెంబ్లీలో 7 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎంఐఎం మద్దతు తెలపడంతో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం మరింత సులభమైంది. గతంలో బీఆర్ఎస్తో స్నేహంగా ఉన్న మజ్లిస్, ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపింది. అయితే అధికారంలో ఉన్న పార్టీతో మజ్లిస్ ఎప్పుడూ అవగాహన కుదుర్చుకుంటుంది.
పోటీ పెట్టాలనుకుని వెనక్కి తగ్గిన బీఆర్ఎస్
ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తొలుత అభ్యర్థిని పోటీకి దించుతామని ప్రచారం జరిగినప్పటికీ, చివర నిమిషంలో వెనక్కి తగ్గింది. అసెంబ్లీలో తమకు ఉన్న ఎమ్మెల్యేల బలం సరిపోదని నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం బరిలో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినా.. పది మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో తిరస్కరించనున్నారు.
విప్ చెల్లదన్న సుప్రీంకోర్టు తీర్పు కారణంగానే వెనుకడుగు వేశారా?
బీఆర్ఎస్ పార్టీ పోటీకి పెట్టి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తారన్నప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తమ ఎమ్మెల్యేలకు జారీ చేసే విప్ చట్టపరంగా చెల్లదని గతంలో కోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, రాజ్యసభ ఎన్నికలు రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలోకి రావు. అంటే, ఒక ఎమ్మెల్యే తన పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా , ఆ కారణంతో ఆయనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదు. అయితే, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు సదరు ఎమ్మెల్యేపై పార్టీ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం మాత్రం రాజకీయ పార్టీలకు ఉంటుంది. రాజ్యసభ ఎన్నికలు ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి కాబట్టి, ఎమ్మెల్యే ఎవరికి ఓటు వేశారో పార్టీ ఏజెంట్కు చూపించాల్సి ఉంటుంది, కానీ విప్ ఉల్లంఘన పేరుతో పదవిని తొలగించే అవకాశం ఉండదు.
ట్రెండింగ్ వార్తలు




















