Telangana Municipal Elections 2026 Results: తొలి విజయం బీఆర్ఎస్దే.. గడ్డపోతారంలో ఎగిరిన గులాబీ జెండా
Gaddapotharam Municipality | తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తొలి విజయం బీఆర్ఎస్ పార్టీ సాధించింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

BRS vs Congress | గడ్డపోతారం: తెలంగాణ మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) పార్టీ బోణీ కొట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా, సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించి తొలి ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ దూసుకుపోయింది.
సంగారెడ్డి జిల్లాలోని గడ్డపోతారం మున్సిపాలిటీలోని మొత్తం 18 వార్డులకు గాను బీఆర్ఎస్ పార్టీ ఏకంగా 14 వార్డుల్లో విజయం సాధించి ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి (ఇతరులు) విజయం సాధించారు. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో గడ్డపోతారం మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగిరింది. ఈ గెలుపుతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ 16న గడ్డపోతారం మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.
హోరాహోరీగా మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
ఫిబ్రవరి 11న తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు (ఫిబ్రవరి 13, 2026) ఉదయం 8 గంటలకు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 పురపాలికలు మరియు 7 నగరపాలక సంస్థల్లోని మొత్తం 2,981 వార్డులు/డివిజన్లకు సంబంధించి 123 కేంద్రాల్లో మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం సాధారణ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు చేపట్టారు. ఓట్ల లెక్కింపులో పారదర్శకత కోసం ప్రతి టేబుల్ వద్ద వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేయగా, భద్రత దృష్ట్యా లెక్కింపు కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ సైతం అమలు చేస్తున్నారు.
ప్రస్తుత సమాచారం ప్రకారం, అధికార కాంగ్రెస్ పార్టీ మెజారిటీ పలు మున్సిపాలిటీల్లో ఆధిక్యతను కనబరుస్తుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) సైతం గట్టి పోటీనిస్తోంది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసి బోణీ కొట్టింది. మరోవైపు, మధ్యాహ్నం 12 గంటల లోపు మెజారిటీ పురపాలికల తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉండగా, నగరపాలక సంస్థల (Corporations) ఫలితాలు సాయంత్రం లోపు వెలువడనున్నాయని అధికారులు తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ వంటి ప్రధాన నగరాల్లో ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడ ఫలితాల వెల్లడికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది.























