Telangana Municipal Elections: ఫిబ్రవరిలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - గ్రేటర్ హైదరాబాద్ సహా - సర్కార్ ప్రయత్నాలు !
Telangana: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

Telangana municipal elections in February: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారాకు సమయం దగ్గరపడుతోంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగియనుండటంతో, 2025 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు మున్సిపాలిటీలు , మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి ఆ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
రాష్ట్రంలోని మెజారిటీ మున్సిపాలిటీల గడువు 2025 జనవరి 26తో ముగిసింది. పాత పాలక వర్గాల గడువు ముగిసిన వెంటనే ప్రత్యేక అధికారుల పాలన విధించారు. ఇప్పటికే ఏడాది అవుతున్నందున సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పాలక మండళ్లను ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా రూపకల్పన, వార్డుల వారీగా విభజన ప్రక్రియపై ఇప్పటికే దృష్టి సారించింది.
మున్సిపల్ ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. కోర్టులో ఉన్నందున అధికారికంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. జనవరి మధ్యలో సంక్రాంతి పండగ ముగిసిన వెంటనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించేలా ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ఉంటాయన్న ఉద్దేశంతో, ఫిబ్రవరి నెలాఖరుకల్లా ఎన్నికల ప్రక్రియను క్లోజ్ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
ఈ మున్సిపల్ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్షగా మారనున్నాయి. గ్రామాల్లో తాము పట్టు నిరూపించుకున్నామని కాంగ్రెస్ భావిస్తోంది. పట్టణాల్లోనూ తమదే పట్టు అని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ , బీజేపీ తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని మున్సిపాలిటీలు మరియు ప్రధాన నగరాల పీఠాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు జనవరి 2020లో జరిగాయి. తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బిఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 120 మున్సిపాలిటీలకు గానూ, టీఆర్ఎస్ 104 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్ 7, బిజెపి 2, ఎంఐఎం 2 స్థానాల్లో గెలిచాయి. ఎన్నికలు జరిగిన 9 కార్పొరేషన్లలోనూ టీఆర్ఎస్ జెండా ఎగురవేసింది. హైదరాబాద్లో మాత్రం హోరాహోరీ పోరు సాగింది. టీఆర్ఎస్ 56 డివిజన్లు , బిజెపి 48 డివిజన్లు , ఎంఐఎం 4 డివిజన్లు, కాంగ్రెస్ 02 డివిజన్లు గెలుచుకున్నాయి. ఈ సారి ఫలితాలను తారుమారు చేస్తామని పార్టీలు అంటున్నాయి.





















