Congress Action Plan: తెలంగాణ కాంగ్రెస్ 99 రోజుల యాక్షన్ ప్లాన్ - ఇక నెక్ట్స్ లెవల్ రాజకీయమే!
Telangana Congress: 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను తెలంగాణ కాంగ్రెస్ ఖరారు చేసుకుంది. ఇందు కోసం మంత్రుల సబ్ కమిటీని నియమించింది.

Congress party has prepared a 99 day action plan: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాలనలో వేగం పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ నలుగురు కీలక మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తం కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు.
ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కార్యాచరణ
రాబోయే ఎన్నికల నాటికి ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు ఈ సబ్ కమిటీ 99 రోజుల ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయనుంది. గ్రామీణ మౌలిక సదుపాయాలు, పెండింగ్ పనులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ ప్లాన్ ప్రధానంగా దృష్టి సారించనుంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేసేలా ప్రభుత్వం యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.
వచ్చే మూడు నెలలు యంత్రాంగం అంతా ప్రజల్లోనే
ప్రభుత్వ వ్యూహం ప్రకారం.. రాబోయే మూడు నెలల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే పర్యటించనున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడంతో పాటు, కొత్తగా చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ప్రభుత్వ పనితీరును ప్రజలకు చేరువ చేయడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు టార్గెట్ గా ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్
— Pulse of Telangana (@pulseoftelangan) February 26, 2026
రాష్ట్రంలో అభివృద్ధి పనుల యాక్షన్ ప్లాన్ తయారీ కోసం కేబినెట్ సబ్ కమిటీ
*నలుగురు మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసిన తెలంగాణ సర్కార్*
*సబ్ కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు,…
గ్రామ స్థాయిలో పెండింగ్ పనులు పూర్తి చేసేలా సన్నాహాలు
ఈ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలోనూ అభివృద్ధి పనుల సందడి నెలకొనేలా చూడాలని సబ్ కమిటీ నిర్ణయించింది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, వంద రోజుల లోపు స్పష్టమైన మార్పు చూపడం ద్వారా ఎన్నికల బరిలోకి దిగాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులకు సైతం స్పష్టమైన గడువులను నిర్దేశించి, పనుల్లో జాప్యం లేకుండా పర్యవేక్షించే బాధ్యతను ఈ నలుగురు మంత్రుల కమిటీకి అప్పగించారు.























