Rythu Bharosa Scheme: రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రేపటిలోగా ఖాతాల్లో రూ.6 వేలు జమ
Telangana CM Revanth Reddy | సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమవుతాయి.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేసింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ. 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను నేటి నుంచి ప్రారంభించింది. 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే 45 రోజుల్లోగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
గత కొంతకాలంగా పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో, ఆర్థిక ఇబ్బందులు లేకుండా రైతులు తమ పంటలను సాగు చేసుకోవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకట్ స్వామి, టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.
3,600 కోట్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ‘సన్న బియ్యానికి రూ.500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం మాది. ఇప్పుడు రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం చుట్టాం. తొలి విడతగా 70 లక్షల మంది రైతులకు రూ.3600 కోట్లు ప్రయోజనం చేకూరనుంది. రేపటిలోగా రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ అవుతాయి. మిగిలిన 5400 కోట్ల రూపాయల్లో 20 రోజుల్లో 2700 కోట్లు, ఇంకో 20 రోజుల్లో 2700 కోట్లు రైతుల ఖాతాలో ఎకరానికి రూ.6000 చొప్పున మొత్తం 9000 కోట్లు రైతు భరోసా నగదు జమ చేస్తాం. మొత్తం 45 రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని’ అన్నారు.
తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT) చేరుస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రూ. 9,000 కోట్ల విడుదల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు కూడా మేలు చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న లోపాలను సవరించి, అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందేలా పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధుల జమ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
‘బీఆర్ఎస్ హయాంలో 114 నెలలు సీఎం కేసీఆర్ రైతులకు సరాసరి ఖర్చు 2533 కోట్లు. నేడు మన ప్రభుత్వం 28 నెలలైతే ప్రతినెల సరాసరి రూ.5500 కోట్లు ఖర్చు పెడుతున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ రైతులకు ఉచిత విద్యుత్, సన్నవడ్లకు బోనస్, రుణమాఫీ, రైతు భీమా, రైతు భరోసా లాంటి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడుకు వేయకుండా ఖర్చు చేస్తున్నాం. ఇప్పటివరకూ రైతులకు లక్షా 30 వేల కోట్లకు పైగా రైతు సంక్షేమం కోసం ఖర్చుపెట్టాం.
వరి పండించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది 2.58 కోట్ల మెట్రిక్ టన్నులతో నెంబర్ వన్గా నిలిచాం. మెదక్, నిజామాబాద్ రైతులకు ఓ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ ప్రాంతంలో నిజాం ఫ్యాక్టరీ నడిచింది. పసుపు, మొక్కజొన్నలు, చెరుకు లాంటివి గతంలో బాగా పండించారు. ఇప్పుడు పామాయిల్ పంట 3 లక్షల ఎకరాలకు చేరింది. 10 లక్షల ఎకరాలకు పండించినా కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
పంట మార్పిడి చేయాల్సిన అవసరం వచ్చింది..
ఖమ్మం, వరంగల్ జిల్లాలో పత్తి, మిర్చి బాగా పండుతుంది. నల్గొండలో వడ్లతో పాటు కొన్ని రకాల కందులు పండుతాయి. మహబూబ్ నగర్లో పచ్చ జొన్నలు, సజ్జలు, కందులు, దోసకాయ పంటలు వస్తాయి. రంగారెడ్డిలో భారతదేశానికే కందిపప్పు పండిస్తున్నారు. పాలకూర, కొతిమిర, మెంతి కూర, ద్రాక్ష తోటలు ఉండేవి. ఆర్టీసీలో పాలక్యాన్లు, కూరగాయలు, ఆకుకూరలతో వచ్చేవారు. పండ్ల తోటలు రియల్ ఎస్టేట్ లే అవుట్లు అయ్యాయి. పాలు, కోడిగుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటన్నాం. రైతులలో పంట మార్పిడి గురించి అవగాహనా పెంచాలని తుమ్మల నాగేశ్వరరావుకు సూచిస్తున్నాం. కేంద్రం 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకే కొంటామని చెప్పింది. కానీ ఈ ఏడాది మనం ఇప్పటికే 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు రాష్ట్రం కొనుగోలు చేసింది. ఎగుమతి చేయాలన్నా గిట్టుబాటు ధర లేదు. కనుక రైతులు పంట మార్పిడి చేస్తేనే పరిస్థితిలో మార్పు వస్తుంది. - రేవంత్ రెడ్డి

























