CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Oil Palm Factory in siddipet | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పాం ఫ్యాక్టరీతో పాటు మొత్తం 775 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించారు.

సిద్దిపేట: ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం (మార్చి 22న) సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో పర్యటించారు. అక్కడ రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేశారు. దీనితో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా నిధులను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ. 775.72 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన మంత్రులతో కలిసి శ్రీకారం చుట్టారు.
సిద్దిపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం..
సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలో విద్యా, వైద్య, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ పలు భవనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో రూ. 141.34 కోట్లతో సిద్ధిపేట మున్సిపాలిటీలో నీటి సరఫరా, డ్రైనేజీ ప్రాజెక్టులు, రూ. 78 కోట్లతో ఎన్సాన్పల్లిలో జిల్లా జైలు భవనం, రూ. 15 కోట్లతో 50 పడకల సమీకృత ఆయుష్ ఆసుపత్రి ముఖ్యమైనవి ఉన్నాయి. వీటితో పాటు సెంట్రల్ మెడిసిన్ స్టోర్, నంగునూరు, అంబేద్కర్ నగర్లలో కొత్త పిహెచ్సి (PHC) భవనాలను జాతికి అంకితం చేశారు.
ప్రజా పాలనలో రైతు ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఈరోజు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రాష్ట్ర రైతులకు అంకితం చేయనున్నారు. దీంతో పాటు రిఫైనరీ యూనిట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
— Telangana CMO (@TelanganaCMO) March 22, 2026
వీటితో పాటు సిద్ధిపేట… pic.twitter.com/WMX8alMDAm
గజ్వేల్ నియోజకవర్గంలో కూడా భారీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి. ముఖ్యంగా కొండపాకలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునాది రాయి వేశారు. మర్కూక్ మరియు జగదేవ్పూర్ మండలాల్లో నూతనంగా నిర్మించిన సమీకృత మండల కార్యాలయాల సముదాయాలను (IOC) ప్రారంభించడంతో పాటు, మర్కూక్ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో అదనపు మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించారు.
అన్నగా బాధ్యత తీసుకున్నాను.. సీఎం రేవంత్ రెడ్డి
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా అన్నారు. 70 లక్షల మంది రైతన్నలకు పంట పెట్టుబడి సాయంగా రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదల నేడు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని రేవంత్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆర్ధిక సాయంతో చేతులు దులుపుకోవడం మాత్రం కాదు… కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని పోస్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్ కు నర్మెట్టలో శంకుస్థాపన చేస్తున్నాం అని ఆదివారం ఆయన చేసిన పోస్ట్ వైరల్ అయింది..

























