Telangana Cabinet decisions: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి తెలంగాణ కేబినెట్ ఓకే - ఎల్ అండ్ టీ నుంచి ఇక ప్రభుత్వం చేతుల్లోకి !
Hyderabad Metro takeover: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి తెలంగాణ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎల్ అండ్ టీ నుంచి పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోకి రానుంది.

Telangana Cabinet approves Hyderabad Metro takeover: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఎల్ అండ్ సంస్థ ఆధ్వర్యంలో ఉన్న మెట్రో ఫేజ్-1 నిర్వహణను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే మార్చి 31, 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఐడీబీఐ అందించిన ఆర్థిక నివేదికలు, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇచ్చిన సాంకేతిక నివేదికలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలనే నిర్ణయం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. ఎల్ అండ్ టీ సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థిక భారంతో పాటు, మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడంలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను అధిగమించేందుకు ఈ అడుగు పడింది. మెట్రో ఫేజ్-1 ప్రైవేటు సంస్థ చేతుల్లో ఉండటం వల్ల, ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపట్టే రెండో దశ విస్తరణకు కేంద్రం నిధులు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. ఈ అడ్డంకిని తొలగించడంతో పాటు, భవిష్యత్తులో మెట్రోను లాభదాయకంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఈ స్వాధీన ప్రక్రియలో భాగంగా ఎల్ అండ్ టీ సంస్థకు సంబంధించి సుమారు రూ.13,000 కోట్ల రుణాలను ప్రభుత్వం స్వీకరించనుంది. అలాగే ఆ సంస్థ పెట్టిన పెట్టుబడికి ప్రతిఫలంగా సుమారు రూ.2,000 కోట్లను వన్-టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. దీనివల్ల హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పూర్తి ప్రభుత్వ రంగ సంస్థగా మారి, విదేశీ ఆర్థిక సంస్థల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. కేవలం రవాణా వ్యవస్థగానే కాకుండా, మెట్రో ఆస్తుల వినియోగం ద్వారా ఆదాయం పెంచుకునేలా కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
మెట్రో నిర్ణయంతో పాటు, కేబినెట్ మరికొన్ని కీలక అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపింది. ముఖ్యంగా ముసి నది పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్వాసితులకు అందజేసే నష్టపరిహారం, పునరావాస ప్యాకేజీలపై సుదీర్ఘంగా చర్చించారు.























