Raja Singh: కిషన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే మళ్లీ పిలుస్తారా ? - రాజాసింగ్కు రాజకీయం అర్థం కాలేదా ?
Telangana BJP: బీజేపీ హైకమాండ్ పిలిస్తే మళ్లీ బీజేపీలో చేరుతానని రాజాసింగ్ అంటున్నారు. కానీ ఆయన కిషన్ రెడ్డిని గట్టిగా విమర్శిస్తూనే ఉన్నారు.

Raja Singh will rejoin BJP: బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు. తాను రాజీనామా చేసినందుకు యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఫోన్ చేసి తిట్టారని ఆయన చెబుతున్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ హైకమాండ్ నుంచి కొంత మంది తనతో టచ్ లో ఉన్నారని వారు ఎప్పుడు ఆహ్వానిస్తే అప్పుడు బీజేపీలో చేరుతానని ప్రకటించారు.
అయితే ఇప్పుడు కూడా ఆయన కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలుచేస్తున్నారు. పార్టీకి రాజీనామా చేసిందున.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొంత మంది బీజేపీ నేతలు ఆయనను డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రాజాసింగ్ స్పందించారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోనని, కిషన్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే తానూ రాజీనామా చేసి, ఇద్దరూ స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసి ఎవరి బలం ఏమిటో నిరూపించుకుందామని సవాల్ విసిరారు. "తెలంగాణలో బీజేపీ నాశనం అయింది కిషన్ రెడ్డి వల్లే. ఆయనే వెనుక ఉండి తనపై తప్పుడు చేయిస్తున్నారు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు రబ్బర్ స్టాంప్ లా పని చేస్తు న్నారని ఆరోపించారు. తాజాగా ఆయన ప్రకటించిన రాష్ట్ర కమిటీపై రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఆ కమిటీ వేసింది ..రామచంద్రరావా..కిషన్ రెడ్డా అని ప్రశ్నించారు. ఈ కమిటీతో తెలంగాణలో బ ీజేపీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాన్నారు. "బీజేపీకి ఎవరు అధ్యక్షుడు అయితే తెలంగాణలో అధికారంలోకి వస్తుందో త్వరలో మరో ప్రెస్ మీట్లో చెప్తాను" అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడిన ఆయనకు ఆ చాన్స్ దక్కకపోవడం, తనకు నామినేషన్ వేసే చాన్స్ కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ.. పార్టీకి రాజీనామా చేశారు. పదే పదే ఆయన పార్టీని ధిక్కరించి పార్టీ నేతలపై విమర్శలు చేస్తున్నందున.. ఆయన రాజీనామాను పార్టీ హైకమాండ్ కూడా వెంటనే అంగీకరించింది. దాంతో ఆయన మాజీ బీజేపీ నేత అయ్యారు. అయితే ఆయన వేరే పార్టీల్లో చేరట్లేదు. తనకు బీజేపీ తప్ప మరో పార్టీ సరిపడదని అంటున్నారు.
ఆయన ఇప్పటికీ రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. పార్టీతో సంబందం లేకుండానే ఇలా చేస్తున్న ఆయనకు.. పార్టీలోకి రానిస్తే మరింత రచ్చ చేస్తారని.. ఆయనను పార్టీలోకి ఆహ్వానించేందుకు ఎవరూ సిద్ధపడే అవకాశం లేదు. సైలెంట్ గా ఉండి.. మళ్లీ బీజేపీలో చేరాల్సిన ఆయన.. పదే పదే రాష్ట్ర నేతలపై విమర్శలు చేస్తూ.. బీజేపీలోకి తనకు ఎంట్రీ లేకుండా చేసుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు.





















